నేడే తొలిదశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు..

302
Telangana mptc zptc elections
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల పదవులకు పోలింగ్‌ను ఎన్నికల సంఘం మూడు దశల్లో చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిదశ పోలింగ్‌ను నేడు ప్రారంభమైంది. ఇక తొలివిడుతలో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

వీటికి సంబంధించిన అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చాశారు. పోలింగ్‌ బూత్‌లు, బ్యాలెట్‌పత్రాల ముద్రణ, నిర్వహణ సిబ్బంది, ఇతరత్రా అన్ని అంశాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. తొలి దశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఇక ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఫిర్యాదులనైనా చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంతో పాటు జిల్లా కేంద్రాల్లోనూ ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌ తెలిపారు. అన్నిచోట్ల ఫిర్యాదుల నమోదుకు టెలిఫోనుతో సహా సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని 040-29802895, 040-29802897 అనే నంబర్లకు ఎవరైనా ఫోను చేసి ఫిర్యాదులను నమోదు చేయించుకోవచ్చు.

- Advertisement -