సుప్రింకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అధికార దుర్వినియోగం చేస్తూ..అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి మిశ్రాపై అభిశంసన నోటీసులు కూడా పంపించాయి. ఈవిషయమై హైదరాబాద్ పర్యటన కుదించుకుని హుటాహుటిన ఆదివారం ఢిల్లీకి చేరుకున్న ఉప రాష్ట్రపతి, అందుబాటులో ఉన్న కొంతమంది నిపుణులతో చర్చించారు. అనంతరం ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులను తిరస్కరించారు వెంకయ్య.
కాగా రాజకీయ ఉద్దేశాలతోనే మిశ్రాపై బురద చల్లడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నందు వల్ల అభిశంసన నోటీసులను తనంతట తాను తిరస్కరించే అధికారం రాజ్యసభ చైర్మన్కు ఉందని, గతంలో మాదిరి కమిటీని నియమించాల్సిన అవసరం లేదని చర్చల్లో పలువురు నిపుణులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
అయితే విపక్షాల అభిశంసన తీర్మానంపై రాజ్యసభ సభ్యులు పెట్టిన సంతకాలు ఎంతవరకు నిజమో వెంకయ్య పరిశీలించారు. 64మంది రాజ్యసభ సభ్యుల సంతకాలతో కూడిన నోటీసులను రాజ్యసభ చైర్మన్కు అందజేసినట్లు కాంగ్రెస్ సీనియర్నేత కపిల్ సిబల్ శుక్రవారం తెలియజేశారు. మరోవైపు తామిచ్చిన నోటీసులను తిరస్కరిస్తే..సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఇప్పటికే కాంగ్రెస్పార్టీ నాయకులు ప్రకటించారు.
ఇదిలాంఉంటే తనపై ఇచ్చిన ఆరోపణలు తేలేదాకా మిశ్రా న్యాయ, పరిపాలనా పరమైన బాధ్యతలనుంచి దూరంగా ఉండాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.