అమెరికా రాయబారితో వినోద్ కుమార్ సమావేశం

488
vinod kumar
- Advertisement -

అమెరికాలో భారత రాయబారి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమిత్ కుమార్ ను వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమెరికా, తెలంగాణ సంబంధాలు, తెలంగాణలో నూతనంగా విదేశీ విశ్వ విద్యాలయాలు, మరిన్ని ఫార్మా, ఐటీ పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై ఇష్టాగోష్ఠి గా చర్చించారు.

దేశంలో విదేశీ విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిషేధం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం-2019 ముసాయిదాను రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో వినోద్ కుమార్ అమెరికా రాయబారితో భేటీ అయ్యారు.

త్వరలో పార్లమెంట్ లో నూతన విద్యా చట్టాన్ని కేంద్రం తీసుకురానున్న విషయాన్ని, నూతనంగా రిసెర్చ్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వినోద్ కుమార్ అమెరికా రాయబారి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని అత్యున్నత విశ్వ విద్యాలయాల గురించి రాయబారితో ఆరా తీశారు.

విదేశీ విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అనువైనదని వినోద్ కుమార్ అమెరికా రాయబారి అమిత్ కుమార్ కు వివరించారు. అమెరికాలోని టాప్ విశ్వ విద్యాలయాలు తెలంగాణలో ఏర్పాటుకు సహకారాన్ని అందించాలని వినోద్ కుమార్ కోరారు. తెలంగాణ లో ఫార్మా, ఐటీ పరిశ్రమలను నెలకొల్పేందుకు ఔత్సాహిక ఎన్నారై లను ఆహ్వానించిన విషయాన్ని ఆయన అమెరికా రాయబారి కి తెలిపారు.

vinod kumar

అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షురాలితో భేటి

అమెరికా-భారత వ్యాపార, వాణిజ్య మండలి అధ్యక్షురాలు, యు.ఎస్. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు నిషా బిస్వాల్ తో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం వాషింగ్టన్ డీ సీ లో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణలో ఫార్మా, ఐటీ పరిశ్రమలు మరిన్ని నెలకొల్పేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించే అంశంపై వినోద్ కుమార్ ఆమెతో చర్చించారు.

పార్లమెంట్ లో నూతన బీమా చట్టం ఆమోదం పొందనున్న నేపథ్యంలో బీమా రంగంలో తెలంగాణ లో చేపట్టే పలు విషయాలపై మాట్లాడారు. ఆ ఇద్దరితో సమావేశమైన ప్రతినిధి బృందంలో డాక్టర్ దేవయ్య, పుష్కూర్ దయాకర్ రావు, రవి పులి, తదితరులు ఉన్నారు.

- Advertisement -