మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఔదార్యం

503
vemula-prashanth-reddy
- Advertisement -

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల్లోని అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 1200 మంది అధికారులు,ఉద్యోగులకు రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలిచి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

తన సొంత నియోజకవర్గంలో ఈ విపత్కర పరిస్థితుల్లో విధుల్లో ఉన్న 1200 మంది ఉద్యోగులకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు.హెల్త్,పోలీసు,రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పంచాయతీ రాజ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భోజన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తన సొంత ఖర్చులతో మంత్రి ఈ ఏర్పాట్లు చేశారు.

కరోనా మహమ్మారి వెంటాడుతున్నా ప్రజా సంక్షేమం కోసం విధుల్లో నిమగ్నమై ప్రభుత్వం తరుపున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనిచేస్తున్న ఈ విభాగాలకు మంత్రి వేముల ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఈ పరిస్థితుల్లో పనిచేస్తూ మధ్యాహ్నం భోజనం కోసం ఇండ్లకు వెళ్తూ విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల బాధలు తెలుసుకొని ఆయన చలించిపోయారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రభుత్వ పిలుపుమేరకు ప్రజల కోసం ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న 8 మండలాల అత్యవసర విభాగ ఉద్యోగులకు బాసటగా నిలవాలని మంత్రి నిర్ణయించారు.

ఇవాళ్టి నుంచి లాక్ డౌన్ ముగిసే వరకు తన సొంత ఖర్చులతో 8 మండలాల్లోని దాదాపు 1200 మంది ఉద్యోగులకు భోజన సౌకర్యం కల్పించాలని,దానికి తగిన ఏర్పాట్లు చేయాలని తన నియోజకవర్గ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.ఏ ఒక్క ఉద్యోగి కూడా భోజనం కోసం ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఖర్చుకు ఎక్కడా వెనకాడొద్దని మంత్రి సూచించారు.మన కోసం పని చేసే వారిని కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. మండల హెడ్ క్వార్టర్స్ లోని ప్రజా ప్రతినిధులు ఈ భోజన ఏర్పాట్లు పర్యవేక్షించడమే కాకుండా ఉద్యోగుల విధులకు ఆటంకం ఎదురవ్వకుండా చూడాలని ఆయన కోరారు.

ప్రజలు కూడా విధిగా లాక్ డౌన్ కు సహకరిస్తూ.. ఇంటికే పరిమితం కావాలని ఆయన కోరారు. అత్యవసరం అయితే తప్పా ఇంటి నుండి బయటకు రావొద్దని, సామాజిక దూరం పాటిస్తూ..ప్రభుత్వ సూచనలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు.ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ ల సూచనల మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9నిమిషాలు పాటు లైట్లు ఆర్పీ..దీపాలు వెలిగించి కరోనా మహమ్మారిని తరిమికొట్టే మహా సంకల్పానికి తోడుగా అందరం ఏకమవ్వాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు.

తమ కష్టాన్ని గుర్తించి, బోజనాలకు ఇబ్బంది పడుతున్నామని తెలుసుకొని మాకు ఈ పరిస్థితుల్లో అండగా నిలిచిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి ఇచ్చిన భరోసాతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ఉద్యోగులు వెల్లడించారు.

- Advertisement -