టీఆర్ఎస్… మాక్ పోలింగ్

194
TRS mock polling for RS seats
- Advertisement -

రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్‌పై టీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్‌ నిర్వహించింది. తెలంగాణ భవన్‌లో జరిగిన మాక్‌పోలింగ్‌కు పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్ కుమార్,బండ ప్రకాశ్,బడుగుల లింగయ్యలు బరిలో ఉండగా ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ గెలుపు లాంఛనమే కానుంది. కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ బరిలో ఉన్న కాంగ్రెస్‌కు తగిన బలం లేకపోవడంతో నామమాత్రంగానే ఆయన పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక్క అభ్యర్థికి 30మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్ఎస్‌ బలం 90కు తోడు ఎంఐఎం సభ్యుల మద్దతు కలుపుకుని 97కి చేరింది. ఎంఐఎం , టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మూడు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్ ఎమ్మెల్యేలు ఒక్కో అభ్యర్థికి ఓటేసేలా ప్లాన్ చేశారు.

సంతోష్‌కు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలను కేటాయించినట్లు సమాచారం. బండ ప్రకాష్ ముదిరాజ్‌కు వరంగల్, మెదక్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు,బడుగుల లింగయ్య యాదవ్‌కు నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలా ఓటేయాలో ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు.

ఇక కాంగ్రెస్‌కు 13మంది ఎమ్మెల్యేలు ఉండగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ శాసనసభ సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేశారు. వీరికి రాజ్యసభ పోలింగ్‌లో ఓటింగ్ అవకాశం ఉంటుందా? ఉండదా? అనేది తేలాల్సి ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వబోమని బీజేపీ,సీపీఎం ప్రకటించాయి.

- Advertisement -