రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభంకానుంది. తెలంగాణభవన్లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తొలి సభ్యత్వం స్వీకరిస్తారు. కోటి మంది సభ్యులే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సమావేశంకానున్నారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.
ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. ఈరోజు నుంచి జులై చివరినాటికి సభ్యత్వ నమోదు కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం తెలంగాణ భవన్లో 11 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 70లక్షల క్రియాశీల-సాధారణ సభ్యులు ఉండగా, ఈసారి కోటి మందిని సభ్యులుగా చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
రికార్డుస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి, టీఆర్ఎస్ బలాన్ని మరోసారి చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. సభ్యత్వం తీసుకున్నవారి వివరాలను కంప్యూటర్ భద్రపరచనున్నారు. సభ్యుల ఆధార్, ఫోన్ నంబర్ సేకరిస్తున్నారు. వాటన్నింటినీ కంప్యూటర్లో భద్రపర్చటంద్వారా భవిష్యత్తులో వారితో నేరుగా ఫోన్లో మాట్లాడటం, టెలికాన్ఫరెన్సుల్లో భాగస్వాములను చేయటం తదితరాలకు వినియోగిస్తారు.