గ్రామాల అభివృద్ధికి విద్యుత్ CMD ల సాయం..

494
CMD Prabhakar Rao
- Advertisement -

గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపుకు తెలంగాణ విద్యుత్ సంస్థల అధిపతులు స్పందించారు. పల్లెప్రగతి పేరుతో ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమానికి ఆకర్షితులై, తమ గ్రామాల అభివృద్దికి ఇతోధికంగా సాయం అందించేందుకు సిద్ధమయ్యారు.

జెన్ కో –ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తన స్వగ్రామమైన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం పల్లారిగూడెంలో తన సొంత ఖర్చులతో ప్రతీ ఇంటికి రెండు చొప్పున ప్లాస్టిక్ బుట్టలు అందించారు. దాంతో పాటు ఇండ్ల నుంచి చెత్త సేకరించడానికి ఆటో ట్రాలీని గ్రామ పంచాయతీకి బహుకరించాలని నిర్ణయించారు. గతంలో ఇదే గ్రామంలో కాటమయ్య దేవాలయం నిర్మాణానికి ప్రభాకర్ రావు రూ.4 లక్షల విరాళం అందించారు.

ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి గౌరవరం రఘుమారెడ్డి తన సొంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లిలో వైకుంఠధామం నిర్మాణానికి తన సొంత భూమిలోంచి అర ఎకరం ఉచితంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇదే గ్రామంలో గతంలో రఘుమారెడ్డి కుటుంబానికి చెందిన ఎకరం భూమిని సబ్ స్టేషన్ నిర్మాణానికి ఉచితంగా ఇచ్చారు.

ఎన్.పి.డి.సి.ఎల్ సిఎండి అన్నమనేని గోపాలరావు తన సొంత గ్రామమైన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమాల కోసం లక్ష రూపాయలు విరాళంగా అందించారు.

తెలంగాణ పల్లెలు భారతదేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో స్పూర్తి పొంది, తాము కూడా తమ గ్రామాలకు చేతనైనంత చేయూత అందివ్వాలని నిర్ణయించుకున్నట్లు జెన్ కో –ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు చెప్పారు.

- Advertisement -