ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం..

640
elections
- Advertisement -

నేటితో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్నిరోజులు గల్లీ గల్లీల్లో తిరుగుతూ మా పార్టీ గుర్తుకి ఓటేయండి.. మా అభ్యర్థికి గెలిపించండి’ అంటూ వినిపించిన మైకులు మూగబోయాయి. నాయకుల ప్రసంగాలకు, హామీలకు తెరపడింది. ఇన్ని రోజులు ఓట్లు కోసం రోడ్డు బాట పట్టి ప్రజలని ఓట్లు అడిగిన నాయకులు.. ఇప్పుడు ఇంటికే పరిమితమై ప్రజలు మాకు ఓటేసి గెలిపిస్తారా లేదా అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 తర్వత ఎలాంటి ప్రచారం చేయవద్దని ఎస్‌ఈసీ సూచించింది. సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 22న 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో పోలింగ్‌ జరగనుంది. 9 కార్పోరేషన్లలోని 325 వార్డుల్లో 1,438 పోలింగ్‌ కేంద్రాలు, 120 మున్సిపాలిటీల్లోని 2, 727 వార్డుల్లో 6, 325 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈసీ పేర్కొన్నది.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబీర్‌పురా డివిజన్‌లోనూ పోలింగ్‌ జరగనుంది. కాగా, కరీంనగర్‌ మున్సిపాలిటీలో మాత్రం ఈ నెల 22న ప్రచారం ముగియనుంది. ఓటరు జాబితాలో తేడాలున్నాయని విపక్షాలు కోర్టులో కేసు వేయడంతో ఈ మున్సిపాలిటీకి కాస్త విరామం లభించింది.

నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని ఎస్‌ఈసీ పేర్కొన్నది. ప్రచారం ముగిసిన నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని యాజమాన్యాలకు తెలియజేసింది. పోలింగ్‌ ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఎస్‌ఈసీ తెలిపింది.

- Advertisement -