పెట్రోల్‌ బంకులకు వన్‌ టైమ్‌ లైసెన్స్‌..

467
- Advertisement -

రాష్ట్రంలో ఉన్న ఎల్‌పిజీ, పెట్రోల్‌ బంకులు, కిరోసిన్‌ డీలర్లు ఇక నుండి ప్రతి ఏడాది లైసెన్స్‌ రెన్యువల్‌ నుండి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకసారి లైసెన్స్‌ తీసుకున్నవారు ప్రతి ఏడాది రెన్యువల్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా వన్‌ టైమ్‌ లైసెన్స్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీచేసింది.

ఇప్పటి వరకు ఎల్‌పిజి, పెట్రోల్‌ బంకులు, కిరోసిన్‌ డీలర్లు తమ లైసెన్స్‌లను జిల్లా పౌరసరఫరాల శాఖ నుండి ప్రతి ఏడాది లేదా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్‌ చేసుకోవాలన్న నిబంధన అమల్లో ఉండేది. దీని నుండి తమకు మినహాయింపు ఇవ్వాలని, వన్‌టైమ్‌ లైసెన్స్‌కు అవకాశం కల్పించాలని పెట్రోల్‌ బంక్‌, కిరోసిన్‌, ఎల్‌పీజీ డీలర్లు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

kcr

ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధ్యయనం చేసి వన్‌ టైమ్‌ లెసెన్స్‌ ఇవ్వడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. దీంతో సీఎం వన్‌ టైమ్‌ లైసెన్స్‌కు ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మతి తెలిపింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం ప్రాడక్ట్‌ (లైసెన్సింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ సప్లయిస్‌ ఆర్డర్‌ 2016)లో అందుకు అనుగుణంగా సవరణలు చేస్తూ గురువారం నాడు పౌరసరఫరాల శాఖ జీ.ఓ నెం. 15ను విడుదల చేసింది.

రాష్ట్రంలో దాదాపు 2553 పెట్రోల్‌ బంకులు, 723 ఎల్‌పిజి డీలర్లు, 900 వరకు ఉన్న కిరోసిన్‌ డీలర్లకు ఈ జివో వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఈ జీవో విడుదల పట్ల పెట్రోల్‌ బంక్‌, ఎల్‌పీజీ, కిరోసిన్‌ డీలర్ల అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపింది.

- Advertisement -