తెలంగాణలో ఎన్ఆర్ఐల పెట్టుబడులకు ప్రోత్సాహం

554
tdf
- Advertisement -

వాషింగ్టన్ డీసీ : నాడు తెలంగాణ విముక్తికై ఉద్యమం…నేడు మాతృభూమి రుణం తీర్చుకోవడానికి మహోద్యమం. నాడు తెలంగాణ వెనుకబాటుపై నినదించిన ఆ గొంతులే… నేడు అదే తెలంగాణ అభివృద్ధి సంక్షేమానికి మేం సైతం… ప్రభుత్వ పథకాలతో మమేకం… అంటున్నాయి. నూతన విధానాల రూపకల్పనలో సహకారం అందిస్తామని నినదించాయి.  బతుకు తెరువుకో…బాగా బతకడానికో…వారు దేశం విడిచి వెళ్ళినా, తల్లిపాల రుణం కొంత తీర్చుకోవడానికి, తెలంగాణ ప్రగతిబాటలో మేం భాగస్వాములం-వారధులం-సారథులం అవుతామనే సందేశాన్నిచ్చారు. వాళ్ళే అమెరికాలో స్థిరపడిన తెలంగాణ ఎన్ ఆర్ ఐ బిడ్డలు. తెలంగాణ ఉద్యమం టైమ్ లో, 1999లో అమెరికాలో ఆరంభించిన తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరానికి 20ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా టిడిఎఫ్, 20వ వార్షికోత్సవాలను ఈ నెల 8,9,10 తేదీల్లో ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ మూడు రోజుల జాతీయ సదస్సుకి అమెరికాలో అన్ని రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ ప్రతినిధులు, వెయ్యికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బిజినెస్, పొలిటికల్, వుమెన్, లిటరేచర్ అండ్ కల్చరల్ forum సమావేశాలు వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు పంపిన వీడియో మెస్సేజ్ ని కూడా సదస్సులో ప్రదర్శించారు.ఉద్యమంలో టీడీఫ్ పాత్ర మరువలేనిది – అభివృద్ధిలో భాగస్వామ్యం కండి, తల్లి రుణం తీర్చుకోండి అని మంత్రి హరీష్ రావు సందేశంలో పిలుపునిచ్చారు . ఇరవయ్యో వసంతాల వేడుకల్లో పాల్గొనాలని ఉన్నా అనివార్య కారణాల తో అమెరికా రాలేకపోయినై మంత్రి చెప్పారు .

*తెలంగాణలో ప్రభుత్వానికి-ఎన్ఆర్ఐలకు వారధిగా టిడిఎఫ్

10వ తేదీన జరిగిన బోర్డు మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను టిడిఎఫ్ ప్రకటించింది. అభివృద్ధలో భాగస్వామ్యం కావాలని, ఎన్ఆర్ఐల పెట్టుబడులు తెలంగాణలోనే పెట్టే విధంగా ప్రోత్సహించాలని, అందుకు వారధిగా నిలవాలని టిడిఎఫ్ ఏకగ్రీవంగా నిర్ణయించింది.

సాగుబడి-సర్కార్ బడిల బాగు కోసం

తెలంగాణ రైతుల కోసం జై కిసాన్, గ్రామీణ స్కూల్స్ కోసం మన బడి కార్యక్రమాలు చేపట్టాలని టిడిఎఫ్ నిర్ణయించింది. రైతాంగానికి సేంద్రీయ సాగుబడి-పెట్టుబడులు, విత్తనాల సేకరణ-మార్కెటింగ్ లపై అవగాహన-చైతన్యం కల్పించాలని టిడిఎఫ్ భావిస్తున్నది. గ్రామీణ స్కూల్స్ కి కంప్యూటర్లు సహా, టాయిలెట్స్, కుర్చీలు, బల్లలు వంటి పలు మౌలిక వసతుల కల్పించాలని తలపెట్టింది. వచ్చే ఏడాదిలోగా తెలంగాణలో కనీసం 100 స్కూల్స్ ని ఈ విధంగా ఆధునీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే 50వేల డాలర్లలను టిడిఎఫ్ సేకరించింది.

TDF బిజినెస్ ఫోరం ఏర్పాటు

ఇరవై వసంతాల సందర్బంగా తొలిసారి టీడీఫ్ బిజినెస్ ఫోరం ఏర్పాటు చేసింది .రాబోయే 5 ఏళ్ళల్లో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించింది. ప్రభుత్వ విధానాల రూపకల్పన, ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ రంగాల్లో అవసరమైన పరిజ్ఞానాన్ని అందించాలని భావిస్తున్నది. ఈ సందర్భంగా బిజినెస్ ఫోరం జాతీయ సదస్సుని బోయినపల్లి అనిల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ బిజినెస్ ఫోరం సదస్సులో కేంద్ర జలవనరుల సలహాదారు శ్రీరాం వెదిరే, తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అరుణారెడ్డి, పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ నేత కొండయ్య గారి మదన్ రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త దేవయ్య పగిడిపాటి, తెలంగాణ పౌల్ట్రీ ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, పారిశ్రామికవేత్త రామ్ మట్టపల్లి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వినోద్ కుమార్ మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ నేతృత్వంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో తెలంగాణని దేశంలోనే రెండో రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. విద్యుత్ సరఫరా, ఇండస్ట్రీయల్ పాలసీ, నీటి వసతి, ఇతర మౌలిక వసతుల కల్పనతోనే…సాధ్యపడిందన్నారు. ఆర్థిక మాంద్యంతో అన్ని రాష్ట్రాలు అల్లాడుతున్నప్పటికీ, హైదరాబాద్ లో ఆ ప్రభావం లేకుండా పరిపాలన సాగుతున్నదన్నారు. హైదరాబాద్ వంటి అనుకూలమైన ప్రాంతం ప్రపంచంలోనే లేదన్నారు. మిగతా వక్తలు మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రగతి అవసరాన్ని, అందుకు కావాల్సిన వసతులను వివరించారు. కాగా 250 మందికిపైగా ఎన్ ఆర్ ఐ పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సదస్సులో ఎన్ ఆర్ ఐ లు అడిగిన అనేక ప్రశ్నలకు వినోద్ కుమార్ సవివరమైన సమాధానాలిచ్చారు.

మహిళా సదస్సు

మహిళా సదస్సులో మహిళలు-ఎదుర్కొంటున్న సమస్యలు-వాటి పరిష్కారాలు, మహిళా సాధికారత, మహిళా హక్కులు-విధులు వంటి అంశాలపై చర్చించారు. ఈకార్యక్రమానికి జమునా పుస్కూర్ అధ్యక్షత వహించగా, శిల్ప వెదిరే, సంధ్యా శీలం, కవితా చల్లా, ఝాన్సీ రెడ్డి, జయా తేలుకుంట్ల, వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు.

పొలిటికల్ సదస్సు

పొలిటికల్ సదస్సు వాడి వేడిగా సాగింది. ఈ సదస్సులో ప్రధాన వక్తగా తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి, సంక్షేమాల్లో ఎన్ఆర్ ఐలు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. అయితే, తెలంగాణలో ప్రజలు స్వేచ్ఛ ని కోరుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే సమయంలో ఆర్టీసి సమ్మెను కొందరు ప్రస్తావించారు. అందులో ఒకరిద్దరు ప్ల కార్డులు ప్రదర్శించారు. దీనికి స్పందించిన వినోద్, ఆర్టీసిని కాపాడుతామని, కార్మికుల ఉద్యోగుల భద్రత కూడా ముఖ్యమేనని, ఇక్కడి అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రికి తెలుపుతామన్నారు. ఆర్టీసిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. కొందరు ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో పడ్డ కార్మిక నేతల కారణంగానే ఈ సమస్య జఠిలంగా మారిందని ఆరోపించారు. బాబు హయాంలోనే ఆర్టీసి ప్రైవేటైజేషన్ కి ప్రయత్నాలు జరిగాయని, దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసిని ప్రైవేటీకరించారు. దేశంలో ప్రైవేటీకరణ చేసుకోవచ్చని చెబుతూ, రాష్ట్రంలో మాత్రం, అందుకు విరుద్ధంగా బీజెపీ వ్యవహరిస్తున్నది. ఆర్టీసిపై మాట్లాడే నైతిక హక్కు బిజెపికి , కాంగ్రెస్ కి లేదని వినోద్ అన్నారు. ఈ పొలిటికల్ సదస్సులో వెదిరే శ్రీరాం, గండ్ర జ్యోతి, గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా సాహిత్య-సాంస్కృతిక కార్యక్రమాలు

తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ధూం దాంగా జరిగాయి. ఎమ్మెల్యే, కవి గాయకులు రసమయి బాలకిషన్, కవి గాయకులు దేశపతి శ్రీనివాస్, సినీ పాటల రచయిత చంద్రబోస్, సినీ నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, గాయకుడు కార్తీక్ కొడగండ్ల తదితరులు పాల్గొన్నారు. కాగా, వేణు నక్షత్రం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

అవార్డులు-సత్కారాలు

ఈ సందర్భంగా లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డుని అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు డాక్టర్ దేవయ్య, BV రావులకు అందచేశారు. అలాగే అతిథులకు జ్ఞాపిక-శాలువాలతో సత్కరించారు.టీడీఎఫ్ ఇరవయ్యో వసంతాల వేడుకలు వియజవంతంగా ముగిశాయని టిడిఎఫ్ ప్రెసిడెంట్, కవితా చల్లా, వేడుకల కు కన్వినర్ గా వ్యవహరించిన టిడిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ రవి పల్లా ప్రకటించారు . ఈ సందర్భంగా కవిత చల్లా , రవి పల్లా మాట్లాడుతూ, ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఇన్నాళ్ళూ సాహిత్య-సాంస్కృతిక రంగాలకే పరిమితమైన టిడిఎఫ్ ఇక నుంచి తెలంగాణ అభివృద్ధిల్లోనూ భాగస్వామ్యం కావాలన్నది లక్ష్యం అన్నారు. పెట్టుబడుల రంగంలో ఎన్ఆర్ఐల ఆవశ్యకతని గుర్తించామని, అందుకే తెలంగాణ ప్రభుత్వంలో కలిసి పని చేస్తామన్నారు . తెలంగాణాలో పెట్టుబడులు పెట్టె వాళ్ళందరికీ వారధిగా ఉంటామన్నారు . అవసరమైతే తెలంగాణ సీఎం కెసిఆర్ తో మాట్లాడి అమెరికాకు తీసుకువస్తామన్నారు కవిత చల్లా , రవి పల్లా .

టీడీఎఫ్ చైర్మన్ రామ్ కాకులవరం, కో కన్వీనర్ రామ్మోహన్ అతిధులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు . టీడీఎఫ్ బోర్డు కొత్త మెంబర్లుగా రవి ఎం. రెడ్డి, కిరణ్ బద్ధం, శ్రీనివాస్ అనుమాండ్ల ను చేర్చుకున్నారు. గుమగుమలాడే వంటకాలతో TDF వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి .

- Advertisement -