ఆరు తీర్పులు…అన్నీ సంచలనమే…!

505
supreme court
- Advertisement -

దేశంలో ఇప్పుడు ఏ నోట విన్న సుప్రీం ఇచ్చిన తీర్పులపైనే చర్చజరుగుతోంది. ఎందుకంటే ఐదు రోజుల్లో ఆరు కీలక తీర్పులు వెలువరించి సంచలనానికి కేరాఫ్‌గా మారింది సుప్రీం కోర్టు. అయోధ్య నుంచి రాఫెల్ వరకు ప్రాధాన్యత ఉన్న కేసులపై తుది తీర్పులు వెలువడ్డాయి.

దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమి వివాదానికి పరిష్కారం చూపింది సుప్రీం. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమి రాముడిదేనని స్పష్టం చేస్తూ ఈ నెల 9న చారిత్రాక తీర్పును వెలువరించింది. అయోధ్యలోనే ముస్లింలకు 5 ఎకరాలు కేటాయించాలని తీర్పులో చెప్పుకొచ్చింది.

ఇక.. ఈనెల 13న ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీసును తీసుకొస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ మేరకు గతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. స్వతంత్రత, జవాబుదారీతనం చేయిచేయి కలిపి నడవాలని ధర్మాసనం తెలిపింది.

శబరిమల వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనం.. మహిళల ప్రవేశంపై ఉన్న వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి అప్పగించింది. అయితే శబరిమల సన్నిధానంలోకి మహిళలను అనుమతిస్తూ 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మాత్రం స్టే విధించలేదు.

కర్నాటక రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేసిన అనర్హతత వేటును సమర్థిస్తూ తీర్పును 13న వెల్లడించింది. అనర్హత కాలం ఎంత ఉండాలని నిర్ణయించే అధికారం స్పీకర్‌కు లేదని స్పష్టం చేసింది. రెబల్ ఎమ్మెల్యేలకు ఊరటనిస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది.

దేశ రాజకీయాలను కుదిపేసిన రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలపై విచారణ జరపలేమని తేల్చి చెప్పింది. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్‌లను కొట్టివేసింది. ఈ కేసులో రాహుల్ గాంధీ పెట్టుకున్న క్షమాపణను అంగీకరించింది.

- Advertisement -