‘ట్రాక్’ మీదకు తెలంగాణ వ్యవసాయం..

250
Minister Niranjan Reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర నూతన వ్యవసాయ విధానంలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో ట్రాక్ తెలంగాణ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. సమగ్ర వ్యవసాయ విధానం అమలుకు తెలంగాణ రాష్ట్ర రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌(ట్రాక్‌)ను అనుసంధానం చేసేందుకు కసరత్తు చేస్తుంది వ్యవసాయ శాఖ.

వానాకాలం నుంచి పంటల వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేయనున్నారు. పంటల వివరాలు రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా వివిధ రంగులతో గుర్తించి ఏ సర్వే నెంబరులో ఎంత పంట సాగులో ఉందో గుర్తించే అవకాశం దీనితో ఉంది. క్రాప్‌ కటింగ్‌ ఎక్స్‌పరిమెంట్‌ డాటా రిమోట్‌ సెన్సింగ్‌తో అనుసంధానం చేస్తే వచ్చే పంట ఉత్పత్తి కూడా అంచనా వేయడానికి అవకాశం గలదు. దీంతో 95 శాతం వాస్తవ సమాచారం అందుబాటులోకి వస్తుంది.

Niranjan Reddy

ట్రాక్‌తో నేలల స్వభావాన్ని అంచనా వేసేందుకు కూడా అవకాశం ఉంది. భూసార పరీక్షల వివరాలను అనుసంధానం చేస్తే ఏ భూమిలో ఎంత మొత్తం ఎరువులు వాడాలో తెలిపే సాంకేతికత దీని సొంతం. ప్రతి ఎకరాలో ఏ రకమైన ఎరువులు వాడాలి, సీజన్‌ను బట్టి ఎంత మోతాదులో ఎరువుల వాడకం ఉండాలని ఇది సూచిస్తుంది.

ఇక ప్రతి సీజన్‌లో వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయిలో సేకరించిన వివరాలు రిమోట్‌ సెన్సింగ్‌ వివరాలతో అనుసంధానం చేస్తారు. ఈ అద్భుతమయిన సాంకేతిక విధానాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే విషయమై పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -