సార్వత్రిక ఎన్నికల సమరానికి సమరశంఖం పూరించింది కాంగ్రెస్ పార్టీ. లోక్ సభ బరిలో నిలచే అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. 15 మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం తొలిజాబితాలో రాహుల్ సోదరి,పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి చోటు కల్పించలేదు.
ఇక ఫస్ట్ లిస్టులో ఉత్తరప్రదేశ్,గుజరాత్ రాష్ట్రాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. యూపీ నుండి 15, గుజరాత్ నుండి 4 అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్కు గట్టిపట్టున్న రాయ్బరేలి నుంచి సోనియాగాంధీ, అమేధి నుంచి రాహుల్గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే ప్రత్యక్షరాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సోనియాకు ఫస్ట్ లిస్ట్లో చోటు కల్పించడం విశేషం.
15మంది జాబితాలో ఉన్న మిగిలిన ప్రముఖుల్లో సల్మాన్ ఖుర్షీద్, జితిన్ ప్రసాద్ , ఆర్పీఎన్ సింగ్ ,ఉత్తరప్రదేశ్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్మల్ ఖత్రీ ,గుజరాత్ పీసీసీ మాజీ చీఫ్ భరత్సింహ సోలంకీ ఆనంద్ ఉన్నారు.
ఎస్పీ-బీఎస్పీలు పొత్తుకు నిరాకరించడంతో యూపీలోని మొత్తం 80 సీట్లకూ తాము పోటీచేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రియాంక సారథ్యంలో యూపీలో ఎన్నికలకు వెళుతున్న కాంగ్రెస్ ఆ రాష్ట్రం నుంచే ఎక్కువ మంది 11 పేర్లను ప్రకటించడం విశేషం. వాస్తవానికి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ నుండి ప్రియాంక బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ రాయ్బరేలీ నుండి సోనియా పోటీచేస్తుండటంతో ప్రియాంక ఎక్కడి నుండి పోటీచేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.