దాదాకు సవాల్‌.. ఓడిపోతే ఆసీస్ జెర్సీ ధరించాలి !

241
Shane Warne's bet to Sourav Ganguly
Shane Warne's bet to Sourav Ganguly
- Advertisement -

ఇంగ్లాండ్ వేదికగా జూన్ 1 నుంచి 18 వరకు జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. టాప్-8 జట్లు బరిలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. అగ్రశ్రేణి జట్లన్నీ టైటిల్ పై కన్నేశాయి. అయితే, డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ టైటిల్ ను నిలబెట్టుకునేందుకు పక్కా స్కెచ్చేసింది. ప్రతి మ్యాచ్ కీలకమే కావడంతో కోహ్లీ సేన అస్త్రశస్త్రాలతో రెడీగా ఉంది. ఓవల్‌ వేదికగా ఇంగ్లాండ్‌, ఇంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగే ఆరంభ మ్యాచ్‌తో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభమవుతుంది. గ్రూప్‌-బిలో ఉన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌.. జూన్‌ 4న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో కామేంటేటర్లుగా పలు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నారు. భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా లండన్ చేరుకున్నాడు. అయితే ఈ ట్రోఫీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్‌ ఫేవరేట్లుగా ఉన్నాయని మాజీ క్రికెటర్లైనా కామేంటేటర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ దాదాకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు షేన్ వార్న్‌, మైకేల్ క్లార్క్‌ల నుంచి ఓ సవాల్ ఎదురైంది.

clarke

జూన్‌ 18న జరిగే ఫైనల్‌లో భారత్‌- ఆస్ట్రేలియా జట్లు తలపడతాయని క్లార్క్‌ ఆశాభావం వ్యక్తం చేయగా.. గంగూలీ ఖండించాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ జట్లు ఫైనల్‌ చేరుకుంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వెంటనే క్లార్క్‌, వార్న్‌ స్పందిస్తూ.. ఇంగ్లాండ్‌ జట్టులో మ్యాచ్‌ విన్నర్లు ఎవరు ఉన్నారంటూ ప్రశ్నించగా… రూట్‌, బట్లర్‌ ఉన్నారని గంగూలీ సమాధానమిచ్చాడు. అంతేకాదు ఏ విభాగంలో చూసినా ఆసీస్‌ కంటే ఇంగ్లాండ్‌ జట్టే పటిష్ఠంగా ఉందని అన్నాడు.

 ఇంతలో వార్న్ కలుగజేసుకొని‌… టోర్నీలో భాగంగా జూన్‌ 10న ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో స్మిత్‌ సేన విజయం సాధిస్తే… గంగూలీ ఆసీస్‌ జెర్సీ ధరించాలి, డిన్నర్‌ పార్టీ ఇవ్వాలని కోరాడు. ఒకవేళ అదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ గెలిస్తే తాము ఇంగ్లాండ్‌ జెర్సీ ధరిస్తామని వార్న్‌ అన్నాడు. ఈ సవాలును గంగూలీ స్వీకరించాడు. దీంతో జూన్‌ 10న జరిగే ఆసీస్‌-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.

Champions-Trophy-Winners

ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో టోర్నమెంట్ చరిత్రలో “Greatest XI” అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్ ఓ జట్టుని ప్రకటించింది. పదకొండు మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని 2002లో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా.. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా అవతరించగా, 2013లో ధోని నేతృత్వంలోని టీమిండియా.. ఇంగ్లాండ్‌పై విజయం సాధించి విజేతగా అవతరించింది.

- Advertisement -