ప్రజలకు చేరువగా ఎస్సీ,ఎస్టీ కమిషన్‌: ఎర్రోళ్ల శ్రీనివాస్

782
errolla srinivas
- Advertisement -

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన జిహెచ్ఎంసిలో సమావేశమైంది. ఈ సమీక్షలో మేయర్ బొంతు రామ్మోహన్, కమీషనర్ డి.ఎస్, లోలేష్ కుమార్, కమీషన్ సభ్యులు బొయిళ్ల విద్యాసాగర్, ఎం.రాంబల్ నాయక్, కుశ్రం నీలాదేవి, సుంకపాక దేవయ్య, చిలకమర్తి నర్సింహా, అదనపు కమీషనర్లు, జోనల్ కమీషనర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగభద్దంగా క‌ల్పించిన‌ హక్కులు, రక్షణలను అందజేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాలలో ప‌ర్య‌టించింది. సమైక్య రాష్ట్రంలో కార్యాలయం, కాగితాలకే పరిమితమైన కమిషన్ ను ఎస్సీ, ఎస్టీ ప్రజలకు చేరువ చేశాం. గతంలో పెండింగులో ఉన్న‌ కేసులతో పాటు కొత్తగా న‌మోదైన 10 వేల అట్రాసిటీ కేసులలో 5 వేల కేసులకు రూ. 40 కోట్లను ఎక్స్‌గ్రేసియగా అందించాం. బాధ్యతలు చేపట్టిన అనంతరం వచ్చిన 5,623 దరఖాస్తులు పరిశీలించి నూరు శాతం పరిష్కరించాం. చైర్మన్ : ప్రతి నెలా 30న పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నాం. 530 మండలాల్లోని 6 వేల గ్రామాలలో పౌర హక్కుల దినోత్సవం జరిగింది. అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నాం. క్షేత్ర స్థాయి నుండి హెడ్ ఆఫీసుల వరకు మార్పు తెచ్చుటకు ప్రయత్నిస్తున్నాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలును తెలుసుకునేందుకు 20 శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించాం. బాక్ లాగ్ ఖాళీల భర్తీకి 2020 మార్చి వరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జిహెచ్ఎంసిలో ప‌నిచేస్తున్న శానిటేష‌న్ కార్మికుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకోవాల‌ని సూచించారు. కాంట్రాక్టుల‌లో ఎస్సీ, ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తింప‌జేసిన రాష్ట్రం మ‌న‌దేన‌ని, ఈ ఖ్యాతి ముఖ్య‌మంత్రి కెసిఆర్‌కు ద‌క్కుతుంద‌ని తెలిపారు. జిహెచ్ఎంసి కాంట్రాక్టులు, న‌ర్స‌రీలు, గ్రీన‌రీ నిర్వ‌హ‌ణ‌లో ఈ రిజ‌ర్వేష‌న్లను అమ‌లు చేయాల‌న్నారు.

ఈ సంద‌ర్భంగా న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ మాట్లాడుతూ టెండ‌ర్ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ షాపుల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీల‌కు ప్ర‌త్యేక వెసులుబాటు క‌ల్పించిన‌ట్లు తెలిపారు. కార్మిక భీమా ప‌థ‌కం, ప్ర‌మాద భీమా ఇత‌ర స్కీం ల ద్వారా కార్మికుల ప్ర‌మాద‌ మృతికి దాదాపు రూ. 21 ల‌క్ష‌లు ఆర్థిక స‌హాయాన్ని అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఇది జిహెచ్ఎంసిలో మాత్ర‌మే అమ‌ల‌వుతున్న‌ట్లు తెలిపారు. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం ప‌థ‌కం ద్వారా రూ. 4ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్థిక స‌హాయం అందించుట‌కై కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. కార్మికుల కుటుంబ స‌భ్యుల వృత్తి నైపుణ్య పెంపుద‌ల‌, ఉద్యోగ క‌ల్ప‌న‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. దాదాపు 96 బ‌స్తీ దవాఖానాలు నెల‌కోల్పి బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఉచితంగా వైద్య సేవ‌లు అందిస్తున్న‌ట్లు తెలిపారు. బ‌స్తీ ద‌వాఖానాల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన వ‌స‌తితో పాటు మౌలిక వ‌సతుల‌ను జిహెచ్ఎంసి ద్వారా క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. సీజ‌న‌ల్ వ్యాధులు, మ‌లేరియా నివార‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఉద్యోగుల‌కు హెల్త్ కార్డులు జారీచేసిన‌ట్లు తెలిపారు.

జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి ప‌రిధిలో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టుల ఖాళీల భ‌ర్తి ప్ర‌క్రియ‌ను చేప‌ట్టుట‌కై రాష్ట్ర ఎస్సీ అభివృద్ది కార్యాల‌యం నుండి అనుమ‌తికై నివేదించిన‌ట్లు తెలిపారు. త‌ద‌నుగుణంగా వ‌చ్చే ఆదేశాల ప్ర‌కారం జిహెచ్ఎంసి ప‌రిధిలోని మూడు జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యంతో బ్యాక్‌లాగ్ ఖాళీల‌ను భ‌ర్తి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. జిహెచ్ఎంసిలో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులుగా 26,134 మంది ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. వారిలో 19,509 మంది శానిటేష‌న్ ప‌నుల‌లో ఉన్న‌ట్లు తెలిపారు. శానిటేష‌న్ వ‌ర్క‌ర్స్‌లో 82శాతం మంది మ‌హిళ‌లే ఉన్న‌ట్లు తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల‌లో 16,850 మంది (64శాతం) షెడ్యూల్డ్ కులాల వారు, 2,848 మంది (11శాతం) ఎస్టీ కులాల వారు ఉన్న‌ట్లు తెలిపారు. శానిటేష‌న్ వ‌ర్క‌ర్ల ర‌క్ష‌ణ‌కు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. హెల్త్ కిట్‌ను అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి హెల్త్ క్యాంపులు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇటీవ‌ల స‌స్పెక్టెడ్‌గా ఉన్న 4,600మంది కార్మికుల‌కు నిర్వ‌హించిన‌ బ్రెస్ట్ క్యాన్స‌ర్ స్క్రీనింగ్‌లో 340 మందికి క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు నిర్థార‌ణ జ‌రిగిన‌ట్లు తెలిపారు. వారికి స‌రైన శ‌స్త్ర చికిత్స చేసేందుకు ఇ.ఎస్‌.ఐ ఆసుప‌త్రిలో స‌దుపాయాలు లేనందున, లిఖిత‌పూర్వ‌కంగా తీసుకొని ఇండో- అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ నందు ట్రీట్‌మెంట్ చేయించుట‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. జిహెచ్ఎంసిలో మొత్తం ఉద్యోగులు, క్యాడ‌ర్ వారిగా పోస్టులు భ‌ర్తీ చేసినవి, ఖాళీలు, భ‌ర్తీచేసిన‌వారిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్ ఖాళీల గురించి క‌మిష‌న‌ర్ వివ‌రించారు.

అంత‌కుముందు GHMC ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ తో చైర్మన్, ఇతర సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యల గురించి చర్చించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ అంబేద్కర్ ను అందరివాడిగా గుర్తించాలని సూచించారు. అంబేద్కర్ ను కొందరికే పరిమితం చేయరాదు. మన దేశ పాలన వ్యవస్థకు దిక్సూచిగా నిలిచే రాజ్యాంగాన్ని రచించారు. అందులో రిజర్వేషన్ అంశం ఒక పేజీ మాత్రమేనని పేర్కొన్నారు.

SC,ST Commission for Telangana People says errolla srinivas….SC,ST Commission for Telangana People says errolla srinivas

- Advertisement -