బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సినీనటుడు ప్రకాష్ రాజ్ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఆయన నామినేషన్ వేసే ముందు అధికారులు షాకిచ్చారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో ప్రకాష్ రాజ్పై కేసు నమోదుచేశారు. మార్చి 12న మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పొలిటికల్ కామెంట్స్ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వీడియో ఆధారంగా ఎన్నికల అధికారి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ప్రకాశ్రాజ్పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
విలక్షణ నటుడిగా సినిమాల్లో పలు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు ప్రకాశ్ రాజ్ గత కొంత కాలంగా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన ఆయన స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.
కర్ణాటకలో జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య, నోట్ల రద్దు తదితర అంశాలపై స్పందిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రకాష్ రాజ్. ముఖ్యంగా మోడీ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచారు. ఇక కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని కోరుతున్న ప్రకాశ్ రాజ్.. తెలంగాణ సీఎం ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు తెలిపారు.