రెబల్స్టార్ ప్రభాస్ తాజాగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్గా పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. పీరియాడిక్ లవ్స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. జార్జియాలో ఓ షెడ్యూల్ షూటింగ్ను ముగించుకున్న చిత్ర బృందం స్వదేశానికి వచ్చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభాస్, పూజ హెగ్డేతో పాటు యూనిట్ మొత్తం ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంది.
ఇక ఈ చిత్రం ఫస్ట్లుక్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ అభిమాని పూజ హెగ్డేను అడిగాడు. ఫస్ట్లుక్ ఎప్పుడు వస్తుందో చెప్పాలని కోరాడు. అయితే, ఈ ప్రశ్న తనను కాదు, డైరెక్టర్ రాధాకృష్ణను అడగండి అంటూ పూజ తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకుంది. అయితే, రాధాకృష్ణ కూడా ఫస్ట్ లుక్పై స్పష్టత ఇవ్వడం లేదు. ఆ విషయం ప్రభాస్, చిత్ర నిర్మాణ సంస్థలకే తెలియాలంటున్నాడు.