బీజేపీ ఎంపీలకు ప్రజల ప్రశ్నలు..!

649
telangana bjp mps
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ దూకుడు పెరిగింది. అయితే తెలంగాణలో పట్టుసాధించాలని భావిస్తున్న బీజేపీకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రతిబంధకంగా మారాయి. ఎన్నికల హామీలపై ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాళేశ్వరంకు జాతీయ హోదా, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వరా అంటూ ప్రజలు బీజేపీ ఎంపీలను ప్రశ్నిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చినట్లుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోథల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్,పసుపు బోర్డు,ఆదివాసీల డిమాండ్‌లపై స్ధానికంగా ప్రజల నుంచి బీజేపీ ఎంపీలకు నిరసన వ్యక్తమవుతోంది.

ఇక ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఆదివాసీ-లంబాడీల మధ్య పోరు జరిగినప్పుడు ఆదివాసీల తరపున పోరాటం చేసి గుర్తింపు తెచ్చుకున్నారు బాపురావు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీచేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ ఆదిలాబాద్,మహబూబాబాద్ రెండు స్ధానాలను లంబాడీలకే కేటాయించింది. దీంతో దీనిని క్యాష్ చేసుకున్న బీజేపీ…ఆయన్ని ఎంపీగా బరిలోకి దింపగా …ఆదివాసీలు ఏకపక్షంగా ఆయనవైపే నిలిచారు.దీంతో ఆయన గెలుపు సాధ్యమైంది. ఆయన

అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే ఇప్పుడు సోయంతో పాటు బీజేపీకి ఇబ్బందిగా మారాయి. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీల ప్రధాన డిమాండ్‌. ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ముందుకు సాగారు. ఎందుకంటే తెలంగాణ ట్రైబల్ జనాభాలో 60 శాతం మంది లంబాడీలే. ట్రైబల్ రిజర్వేషన్లు,గిరిజన్లకు ఉద్దేశించిన అన్ని ప్రయోజనాలను లంబాడీలే తీసుకెళ్తున్నారని ఆదివాసీల ప్రధాన ఆరోపణ. అందుకే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే బీజేపీ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసే ధైర్యం చేయలేదు. ఎందుకంటే లంబాడీల ఓట్ల వల్ల బీజేపీకి ఇబ్బందులు తప్పవు. ఆదీవాసీల కొరకు లంబాడీల ఓట్లను వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. దీంతో సోయంబాపురావును నిలదీస్తున్నారు ప్రజలు. సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఆదివాసీల డిమాండ్లను సాధించలేకపోతే ఎంపీగా రాజీనామా చేస్తానన్న సోయం బాపురావు మాటలను గుర్తు చేస్తూ ఎప్పుడు రాజీనామా చేస్తారని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

- Advertisement -