అక్టోబర్‌ 1 నాటికి బెల్టు షాపులు ఎత్తివేత:జగన్‌

355
jagan
- Advertisement -

అక్టోబరు 1 నాటికి బెల్టుషాపులు పూర్తిగా ఎత్తివేయాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం జగన్‌. ఉండవల్లిలోని ప్రజా వేదికలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా మాట్లాడిన జగన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలకు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. సమాజానికి మంచే చేసే నిర్ణయాల అమల్లో అడుగులు ముందుకు పడాల్సిందేనని సూచించారు. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దని చెప్పిన జగన్‌ … దాబాల్లో లిక్కర్‌ అమ్మకుండా చూడాలని ఆదేశించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు నియంత్రించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించాలన్నారు. గంజాయి సాగును రెవెన్యూ, పోలీసు, అటవీ, ఎక్సైజ్‌, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా అరికట్టే ప్రయత్నం చేయాలన్నారు.

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. ఏపీలో పోలీసు సిబ్బంది కొరత ఉందని, 12,198 మంది సిబ్బంది అవసరమని చెప్పారు. విభజన హామీల మేరకు కొత్తగా ఆరు ప్రత్యేక పోలీసు బెటాలియన్లు, రెండు ఎన్డీఆర్ఎఫ్‌ బెటాలియన్లు రావాల్సి ఉందని తెలిపారు. పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేయడంపై ముఖ్యమంత్రికి డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పటిష్ఠం చేస్తామని, రౌడీయిజం, ఫ్యాక్షనిజంపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -