తెలంగాణలో హింసకు తావులేదు..షా టూర్‌పై మాజీ ఎంపీ వినోద్

445
mp vinod
- Advertisement -

హోంమంత్రి పదవిలో ఉన్న అమిత్ షా హైదరాబాద్ లో రెచ్చగొట్టేలా మాట్లాడారని మండిపడ్డారు మాజీ ఎంపీ వినోద్ కుమార్‌. తెలంగాణ టూర్ సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. బెంగాల్ లాగా తెలంగాణ కావాలని కోరుకోవడమంటే హింసను ప్రేరేపించడమేనని ఆరోపించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ హోంమంత్రి అంతర్గత భద్రతను కాపాడేలా మాట్లాడాలని సూచించారు.

హింసకు తావు లేకుండా తెలంగాణ ఉద్యమం నడిపించి రాష్ట్రం సాధించామని..బెంగాల్ తరహా రాజకీయ హింసను ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. శాంతి ఉన్నచోటనే అభివృద్ధి ఉంటుందని తెలిపిన వినోద్ పోలీసు మంత్రిగా ఉన్న అమిత్ షా ఇక్కడి పోలీసులకు పని కల్పించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

వీధి పోరాటాలు చేస్తాననడం ఆయన స్థాయికి తగదన్నారు. 15 రోజులకో మంత్రిని పంపిస్తాననడం ఆహ్వానిస్తున్నాం…ముందుగా జలమంత్రి షకావత్ ను పంపించి మా ప్రాజెక్టులు చూసి నిధులివ్వమనండన్నారు. తర్వాత గడ్కరీని పంపించి మేము గతంలో పంపించిన జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయమనండి ,పీయూష్‌ గోయల్ ను పంపించి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేయమనండన్నారు.

పదిహేను రోజులకో మంత్రిని పంపండి. తెలంగాణకు కావాల్సిన అవసరాలు తీర్చండి. మేము మంత్రులకు ఏడాది సరిపడా ఎజెండా ఇస్తాం…కానీ అమిత్ షా ఎజెండా తెలంగాణ వ్యతిరేక ఎజెండా అన్నారు.బీజేపీని విస్తరించుకుంటే విస్తరించుకోండి. శాంతికి విఘాతం కలిగించకండని సూచించారు. వీధి పోరాటాలు కాదు సైద్ధాంతిక పోరాటం చేద్దామన్నారు.

రైల్వే గురించి బడ్జెట్ లో చర్చనే లేదు. ప్రత్యేక రైల్వే బడ్జెట్ పెట్టాలి.కొత్తపల్లి – మనోహరా బాద్ రైల్వే లైన్ ను నిర్వీర్యం చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. రైతుబంధు, మిషన్ భగీరథను బీజేపీ కాపీ కొట్టిందని…40 లక్షల మందికి మేము ఫించన్లు ఇస్తున్నాం… మీరిచ్చేవెన్నో చెప్పాలన్నారు.

బీజేపీ కుట్రలను తిప్పికొడ్తామని తెలిపిన వినోద్ తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తే.. రాష్ట్రం సాధించిన పార్టీగా మేం చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు రాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ప్రాణహిత చేవెళ్ల తెచ్చిన్నాడు అధికారంలో ఉన్న మీరు ఎందుకు జాతీయ హోదా ఎందుకీయలేదని ప్రశ్నించారు?

తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ పనికి రాని పార్టీలని ఎద్దేవా చేశారు. సభ్యత్వ నమోదులో ఊరూరా ఈ పార్టీల తీరును ప్రజలకు వివరిస్తాం…తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన 2001లో పుట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు ఓటు హక్కు రాబోతోంది. అలాంటి వాళ్లకు సభ్యత్వంలో ప్రియార్టీ ఇస్తామన్నారు.

- Advertisement -