తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటు పట్ల తాను అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి పదవుల కోసం రాలేదని కేవలం ప్రభుత్వ పథకాలు, ముఖ్యమంత్రి నాయకత్వం పట్ల ఆకర్షితులై మాత్రమే టిఆర్ఎస్లో చేరమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పార్టీలో చేరిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తున్నానని, పదవుల కోసం కాదని వెంకటరమణ రెడ్డి తెలిపారు.
టిఆర్ఎస్ పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి తమ నాయకుడని వివిధ సమీకరణాలు, ప్రభుత్వం అవసరాల నేపథ్యంలో మంత్రివర్గాన్ని నిర్ణయించే అధికారం పూర్తిగా ఆయనకే ఉంటుందని, ఈ విషయంలో తమకెలాంటి అసంతృప్తి లేదని ఆయన తెలిపారు. తన దృష్టి అంతా టిఆర్ఎస్ పార్టీ బలోపేతం పైనే ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ఇక తన భార్య గండ్ర జ్యోతికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి రావడం, ముఖ్యమంత్రి ఆశీస్సుల వల్లనే, ఇది తమ కుటుంబానికి ఎంతో గౌరవాన్ని,బాధ్యతను ఇచ్చిందని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు.
తాను అనని మాటలను కొన్నిపత్రికలు అన్నట్లు రాయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా అంటే తనకు ఎంతో గౌరవమని కానీ వార్త విలువలను వదిలివేసి అసత్యాలను ప్రచారం చేయొద్దని గండ్ర వెంకటరమణా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.