కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ..

388
Minister Niranjan Reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో వేరుశనగ పరిశోధనా కేంద్రానికి రూ.50 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు లేఖ రాశారు. వేరుశనగ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రూ.50 కోట్లు మంజూరు చేయండి. సాగునీటి రాకతో తెలంగాణ సాగు స్వరూపం మారిపోయింది. దేశంలోనే అత్యధికంగా వేరుశనగ దిగుబడి వనపర్తి, నాగర్ కర్నూలు, జోగుళాంబ గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల నుండి వస్తుంది.హెక్టారుకు ఈ ప్రాంతంలో 1611 కిలోల దిగుబడి వస్తుంది.. దేశ సరాసరి దిగుబడి 1486 కిలోలు మాత్రమే అని లేఖలో పేర్కొన్నారు.

నాణ్యమైన విత్తనాలతో పాటు, ఆప్లాటాక్సిన్ లేని వేరుశనగ  దిగుబడి ఈ ప్రాంతానికి సొంతం. సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో రైతాంగానికి మరింత తెగుళ్లను తట్టుకుని నిలబడే నాణ్యమయిన విత్తనాలు అందించడంతో పాటు, ఎగుమతికి అవకాశముండే వేరుశనగ పండించడానికి వనపర్తిలో ఒక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆప్లాటాక్సిన్ లేని వేరుశనగకు విదేశాలలో మంచి డిమాండ్ ఉంది.. దీని నుండి ఉత్పత్తి చేసే పీనట్ బట్టర్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది అని మంత్రి తెలిపారు.

విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటు, దానికి అవసరం అయిన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం, ల్యాబ్ ను ఏర్పాటు చేయడం, నూతన భవనం కోసం కేంద్రం నుండి రూ.50 కోట్లు మంజూరు చేయండి. పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్థలాన్ని గుర్తించి కేటాయించడం జరిగింది. కేంద్రం సహకరించి నిధులు మంజూరు చేస్తే తెలంగాణ రైతులకు ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటు ఎంతో మేలు చేస్తుంది అని మంత్రి నిరంజన్‌ రెడ్డి లేఖలో వివరించారు.

- Advertisement -