పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి

455
minister errabelli dayakarrao
- Advertisement -

జనవరి 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి తో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పల్లె ప్రగతి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మొదటి దశ విజయవంతంగా నిర్వహించారని, రెండవ విడత పల్లె ప్రగతి విజయవంతానికి తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు.

పల్లెప్రగతి నిర్వహణతో దేశవ్యాప్తంగా రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చిందని, రెండవ విడత నిర్వహణకు సంబంధించి జిల్లా స్ధాయి సమావేశాల నిర్వహణను వెంటనే పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామ పంచాయతీల కోసం ప్రతి నెల 339 కోట్లను విడుదల చేశామన్నారు. గ్రామాలలోని యువకులను, మహిళలను, పెన్షనర్లను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యేలా చూడాలన్నారు. గ్రామాల వారిగా చేపట్టిన, చేపట్టపోయే పనులు, కార్యక్రమాల వివరాలపై బుక్ లెట్ అందించాలన్నారు. పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్ ల కొనుగోలుకు చర్యలు సత్వరం పూర్తి చేయాలన్నారు. తమ గ్రామాలను తామే పరిశుభ్రంగా ఉంచుకునే స్పూర్తి కలిగేలా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు.

గ్రామాల్లో నర్సరీల పెంపకం, వైకుంఠదామాలు, Dumping యార్డులకు స్ధలసేకరణ, నాటిన మొక్కల సంరక్షణ, శిధిల గృహాల తొలగింపు, పాతబావుల పూడ్చివేత, డస్ట్ బిన్ల సరఫరా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం లాంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు జనవరి 2 న నిర్వహించే గ్రామ సభలలో పాల్గొనాలన్నారు. గ్రామాలలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సరియైన రీతిలో పల్లె ప్రగతిని నిర్వహించేలా చూడాలన్నారు. విధులలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవడం తో పాటు మంచిగా పనిచేసే వారిని ప్రోత్సహించాలన్నారు. ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రతలో మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామాన్ని స్పూర్తిగా తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె జోషి మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు 50 మంది రాష్ట్ర స్ధాయి అధికారులను Flying Squad అధికారులుగా నియమించామని, ప్రతి అధికారికి వివిధ జిల్లాలలోని 12 మండలాలను కేటాయించామని, మండలంలో 2 గ్రామ పంచాయతీలను సందర్శించి పనుల పురోగతిని, నాణ్యతను, కార్యక్రమ అమలును పరిశీలిస్తారని అన్నారు. జనవరి 2 న నిర్వహించే గ్రామసభలో పాల్గొనాలని అన్నారు. మార్చి 31 నాటికి తమకు కేటాయించిన మండలాలను సందర్శించి పల్లె ప్రగతి కార్యక్రమాల అమలును, గ్రామాలకు చేకూరిన లబ్ధిని అంచనా వేయాలన్నారు. ప్రతి అధికారికి 23 అంశాల ప్రోఫార్మాను అందజేశామని, ప్రతి అంశానికి 1 నుండి 5 వరకు గ్రేడింగ్ ఇవ్వాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖ రూపొందించే మోబైల్ ఆప్ లో డాటాను ఫీడ్ చేయాలని సూచించారు.

- Advertisement -