చురుగ్గా సాగుతున్న ధాన్యం కొనుగోళ్ళు..

253
Mareddy Srinivas reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 3547 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.16 లక్షల మంది రైతుల నుండి కనీస మద్దతు ధరకు రూ. 4200 కోట్ల విలువ చేసే 23 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ధాన్యం విక్రయించడంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం లేకుండా ఏరోజుకారోజు ధాన్యాన్ని మిల్లులకు తరలించడం జరుగుతోంది. కొనుగోలు చేసిన దానిలో 22.14 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించడం జరిగింది. ఈ వివరాలను రైస్‌ మిల్లర్లు ఓపీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసిన వెంటనే రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులను ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు.

ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులను పౌరసరఫరాల సంస్థకు సమకూర్చిందని, చెల్లింపుల్లో జాప్యం లేకుండా, రైతుల కొనుగోలు వివరాల నమోదు, రైస్‌ మిల్లర్ల అక్నాలెడ్జ్‌మెంట్‌లో జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. రైతులకు నష్టం జరిగే విధంగా నాణ్యత పేరుతో తరుగు తీయకుండా చూడాలని ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్న జాయింట్‌ కలెక్టర్లను, డీసీఎస్‌ఓలను, జిల్లా మేనేజర్‌లు, ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులనకు ఆదేశించడం జరిగింది.

Mareddy Srinivas reddy

కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం (తేమ 17 శాతం మించకుండా) రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ఈ విషయంలో రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి గన్నీ సమస్య లేదని, రైతులకు అవసరమైన సుతిలీ దారం సమకూర్చాలని, తూకం విషయంలో జాగ్రత్తలు వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు నిజామాబాద్‌లో 3.82 లక్షల మెట్రిక్‌ టన్నులు (ఎల్‌ఎంటీలు), కామారెడ్డి-2.85 (ఎల్‌ఎంటీలు), జగిత్యాల-2.10 (ఎల్‌ఎంటీలు), నల్గొండ-1.90 (ఎల్‌ఎంటీలు), యాదాద్రి-1.78 (ఎల్‌ఎంటీలు), కరీంనగర్‌-1.55 (ఎల్‌ఎంటీలు)..లలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

పంటకు కనీస గిట్టుబాటు ధర ఖచ్చితంగా లభిస్తుందన్న భరోసాతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. దీంతో రైతులకు అందుబాటులో ఉండే విధంగా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మీల్లర్ల నుంచి గన్నీ సంచుల వెంటనే తీసుకోవాలి. మిల్లర్ల నుంచి గన్నీ సంచులు తిరిగి వెనక్కి తీసుకునే విషయంలో అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలి. సకాలంలో మిల్లర్ల నుండి గోనె సంచులు వెనక్కి తీసుకోకపోవడం వల్ల పౌరసరఫరాల సంస్థకు ఆర్థికంగా భారమవుతోందనీ, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సీజన్‌ ముగిసిన వెంటనే మిల్లర్ల నుంచి సంచులను వెనక్కి తీసుకోవాలనీ, అలాగేపెండింగ్‌లో ఉన్న గన్నీ సంచుల లెక్కలను (రీకన్సిలేషన్‌) త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.

- Advertisement -