ఇటీవల లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ఓ బ్రాహ్మణ మహాసభకు హాజరై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సమాజంలో బ్రాహ్మణులకు గొప్ప స్థానం ఉందని.. ఇది పరుశురాముడి త్యాగం, తపస్సు కారణంగా ప్రాప్తించిందని ఆయన తెలిపారు. ఈ కారణం వల్లే సమాజానికి మార్గదర్శకత్వం వహించే కీలక భూమికను బ్రాహ్మణులు పోషిస్తున్నారని ఓం బిర్లా బ్రాహ్మణ సభలో చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుండి విమర్శలు వెల్లువెత్తాయి.
ఓ బాధ్యాతమయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్న తరుణంలో..వారికి మద్దతుగా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ట్విట్టర్ ద్వారా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. “నేను బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిని. అయితే కొందరు బ్రాహ్మణులకు మాత్రం మేం గొప్ప అనే ఫీలింగ్ ఎందుకు ఉంటుందో? అర్థం కావడం లేదు.
నువ్వు చేసే పనులను అనుసరించే నువ్వు గొప్పవాడివి అవుతావు. కానీ నీ కులం వల్ల కాదు“ అంటూ లావణ్య ట్వీట్ చేశారు. అయితే తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయని అనుకుందో ఏమో!. ట్వీట్ను డిలీజ్ చేసింది లావణ్య.
ట్వీట్ తొలగింపుపై తాజాగా వివరణ ఇచ్చింది ఈ అమ్మడు. “నా అభిప్రాయాలను బలంగా వినిపించే క్రమంలో ఎవరి మనోభావాలను గాయపర్చడం నా ఉద్దేశం కాదు. అందుకే ఆ ట్వీట్ తొలగించాను. ట్వీట్లు కొన్నిసార్లు తప్పుదోవ పట్టిస్తాయి. కులం కంటే మనం చేసే మంచిపనులే గుర్తింపునిస్తాయని నేను నమ్ముతాను” అంటూ ట్విట్టర్ లో స్పందించింది.