బిల్ట్ పునరుద్దరణపై కేటీఆర్ సమీక్ష..

510
minister ktr
- Advertisement -

వరంగల్ జిల్లా కమలాపూర్ లోని బల్లార్ పూర్ ఇండస్ర్టీస్ (బిల్ట్) పునరుద్దరణ కార్యకలాపాలపైన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. బిల్ట్ ఛీప్ అపరేటింగ్ అఫీసర్ (సివోవో)నేహార్ అగర్వాల్, సిజియం హరిహరణ్ ఈరోజు మంత్రిని కలిసి కంపెనీ పునరుద్దరణ కోసం చేపట్టిన పనులను మంత్రికి వివరించారు.

బిల్ట్ పునరుద్దరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించి, కంపెనీ యాజమాన్యంతో చర్చలు నిర్వహించిందని, కంపెనీ తిరిగి తెరుచుకునేందుకు కావాల్సిన ప్రొత్సహాకాలను కల్పించినా యాజమాన్యం చేపట్టిన కార్యక్రమాల్లో మందగమనం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో పునరుద్దరణ కోసం చెప్పిన గడువు తప్పిందని, కానీ కంపెనీ యాజమాన్యం తీరు వలన అలస్యం అవుతున్నదన్నారు. కంపెనీ కార్మికుల ప్రయోజనాలు, ఉపాది విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉన్నదని మంత్రి తెలిపారు. ఈమేరకు వారి జీతాల బకాయిల చెల్లింపుల కోసం కంపెనీ యాజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని మంత్రి సమీక్షించారు.

వారి బకాయిల కోసం ఇప్పటికే ఒప్పందం పూర్తియిందని, ఈ దీపావళి పండగ సందర్భంగా పదివేల రూపాయాల అడ్వాన్స్ ఇచ్చేందుకు కంపెనీ ఒప్పుకున్నది. కంపెనీ తరపున ఏర్పాటు చేసుకున్న కన్సల్టెంట్లు ఒక నివేదికను సిద్దం చేశారని, మరిన్ని పెట్టుబడుల కోసం బ్యాంకులకు సమర్పించామని కంపెనీ మంత్రికి తెలిపింది. కంపెనీ పురుద్దరణలో భాగంగా ఐటి నెట్ వర్కింగ్ పనులు ప్రారంభం అయ్యాయని, వచ్చే ఆగస్టు నాటికి కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తామని మంత్రికి కంపెనీ యాజమాన్యం హమీ ఇచ్చింది.

ఇప్పటికే గతంలో ఇచ్చిన డెడ్ లైన్లను కంపెనీ మిస్సయిందని, ఇప్పుడు చెబుతున్న గడువులోగా పునరుద్దరణ పూర్తి చేయకుంటే, రాయితీలు రద్దు చేసి, బిల్ట్ యూనిట్ ను కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. వేంటనే కంపెనీ మిషనరీ పునరుద్దరణ పనులు ప్రారంభించాలని, ఇందులో కార్మికులను భాగస్వాములను చేయాలని మంత్రి, కంపెనీ యాజమాన్యాన్ని అదేశించారు.

ప్రస్తుత గడువులోగా పనులు పూర్తి చేస్తామని కంపెనీ నుంచి ఒక హమీ పత్రాన్ని తీసుకోవాలని, పనులను ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ కు మంత్రి అదేశాలు జారీ చేశారు. గతంతో కొన్ని అనివార్య కారణాల వలన పనులు కొంత ఆలస్యంగా ప్రారంభం అయ్యాయని, ప్రస్తుతం ప్రభుత్వానికి తెలిపిన గడువులోగా ఖచ్చితంగా పునరుద్దరణ పూర్తి చేస్తామని కంపెనీ సివోవో నేహార్ అగర్వాల్ మంత్రికి హమీ ఇచ్చారు.

- Advertisement -