సీఎం కేసీఆర్‌ కూడా ఓ భూ నిర్వాసితుడే.. కేటీఆర్

273
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని, సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు త్వరలోనే రానున్నాయన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ యావత్తు దేశం దీని వైపే చూస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశామని చెప్పారు.

KTR

ఇక ఈ ప్రాజెక్టులకు భూమి ఇచ్చిన నిర్వాసితులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. తన తల్లిదండ్రులు కూడా భూ నిర్వాసితులేనని, మిడ్ మానేరు ప్రాజెక్టులో తన తల్లి కూడా భూమిని పోగొట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నిర్వాసితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కృషి చేస్తున్న ఇంజనీర్ల పని తీరు భేష్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అజేయశక్తిగా ఎదుగుతుందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తమకే పట్టం కడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం దేవుడితోనైనా తలపడే మనస్తత్వం ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ నెల 27 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కేసీఆర్ ప్రారంభిస్తారని, దీనిని ఓ పండగలా నిర్వహించాలని అన్నారు.

- Advertisement -