కర్ణాటక మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ కు అధిష్టానం కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రమేష్ కుమార్ కు కన్నడ రాజకీయాల్లో మంచి పట్టు ఉండటంతో ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తుంది.
స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన కేపీసీసీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ సభ్యత్వాన్ని స్వీకరించడం, స్పీకర్ ఎన్నిక రోజు సభలో సంఘ్పరివార్ భావజాలాన్ని తూర్పారపడుతూ ప్రసంగించడం వంటి అంశాల నేపథ్యంలో అధిష్ఠానం పెద్దలు కూడా రమేశ్కుమార్వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.
బీజేపీ ప్రభుత్వానికి ధీటుగా మాట్లాడే సత్తా రమేష్ కుమార్ కు మాత్రమే ఉన్నట్లు అధిష్టానం పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు అందరూ ఒంటెద్దుపోకడల వల్లే సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిందని తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనకు నచ్చినట్లు చేయడం వల్లే పార్టి నుంచి 13 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని అధిష్టానానికి వివరించారట ఎమ్మెల్యేలు.
ఒకవేళ ప్రతిపక్ష నేతగా సిద్దరామయ్యను నియమిస్తే గనుకు మరికొంత ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రతిపక్షనేత పదవి కోసం పార్టీ సీనియర్ నేతలు డీకె.శివకుమార్, జి.పరమేశ్వర్, హెచ్.కె.పాటిల్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరొకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.