అన్నార్తులకు ఆసరాగా నిలిచిన కవితక్క..

396
k kavitha
- Advertisement -

కష్టాల్లో ఉన్నప్పుడు కనికరించే వారే నిజమైన నాయకులు అన్న పదానికి నిదర్శనంగా నిలిచారు కల్వకుంట్ల కవిత. గత రెండు సంవత్సరాలుగా లక్షలాది మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న కవిత, ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో పేదలు, వలస కూలీల ఆకలి తీర్చేందుకు మరో ముందడుగు వేశారు. గత రెండు సంవత్సరాలుగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రుల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కల్వకుంట్ల కవిత, ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు గాను మరో మూడు కొత్త అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు, లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కూలీలు పడుతున్న ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రజలు కవిత దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే దీనిపై దృష్టి సారించిన కల్వకుంట్ల కవిత, ఆయా ప్రాంతాల్లో అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులతో చర్చించి, అవసరమైన చోట అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయించారు కవిత.

ఇందులో భాగంగా నిజామాబాద్ పట్టణంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల కోసం ప్రత్యేకంగా ఒక అన్నదాన కేంద్రాన్ని ఈరోజు నగర మేయర్ నీతూ కిరణ్ ప్రారంభించారు. ఇందులో ప్రతి రోజు దాదాపు 500 మంది అన్నార్తులకు భోజనం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పోరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని జెడ్పీ ఛైర్మన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

దీంతో పాటు మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మరో అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జగిత్యాల ‌జిల్లా‌ అధ్యక్షులు చెర్లపల్లి అమర్ దీప్ గౌడ్, జిల్లా కో కన్వీనర్ వెలుముల శ్రీనివాస రావు, తెలంగాణ జాగృతి కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి MD.జావీద్, తెలంగాణ జాగృతి మెట్ పల్లి పట్టణ అధ్యక్షులు బిట్లుగు కార్తీక్ పాల్గొన్నారు. అంతేకాదు కరోనా వైరస్ ప్రభావం కారణంగా, కౌంటర్ల వద్ద సామాజిక దూరం పాటించేలా వాలంటీర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ లో నిలబడే వారి మధ్య కనీసం మీటరు దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. వాలంటీర్ల కోసం తగినన్ని మాస్కులు సైతం అందుబాటులో ఉంచారు.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో అన్ని ప్రాంతాల్లో హోటళ్లు, భోజనశాలు మూతపడి ఉన్నాయి. దీంతో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న అనేక మంది రోగుల సహాయకులకు మాత్రమే కాకుండా వందలాది మంది పేద ప్రజలకు, వలస కూలీలకు, కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాల ద్వారా, ప్రతి మధ్యాహ్నం ఉచితంగా భోజనం అందుతుంది. ఈ అన్నదాన కేంద్రాల ద్వారా ప్రతిరోజు దాదాపు 2000 మంది పేదలకు ఉచిత భోజనం అందించున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యులుగా పరిగణిస్తామని, వారు కుటుంబ సభ్యుల లాంటి వారని సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కరువై పూట గడవడానికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వలస కూలీల కష్టాలను గుర్తించిన కల్వకుంట్ల కవిత, వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. వారి ఆకలి తీర్చేందుకు గాను నిజామాబాద్ పట్టణంలో అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

అన్నదాన కేంద్రాల నేపథ్యం..

కల్వకుంట్ల కవిత , రెండు సంవత్సరాల క్రితం ఎంపీ హోదాలో ఒకసారి జిల్లా ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా రోగులతో పాటు అక్కడ ఉన్న సహాయకులు తమకు ఎదురవుతున్న భోజన ఇబ్బందులను అని ఆమె దృష్టికి తీసుకు రావడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నది. కేవలం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రమే కాకుండా ఆర్మూర్, బోధన్ ప్రభుత్వాసుపత్రుల వద్ద కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు కవిత ఆధ్వర్యంలో కొనసాగుతున్నవి. రెండు సంవత్సరాల కింద కల్వకుంట్ల కవిత ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమం ప్రస్తుత లాక్ డౌన్ లోనూ నిరాటంకంగా కొనసాగుతోంది. పది రోజుల కింద జనతా కర్ఫ్యూ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిలిపివేయడంతో అనేక మంది నిరుపేదలు ఆకలితో అలమటించారు. ఈ విషయం కవిత దృష్టికి రావడంతో తన కార్యాలయ సిబ్బందితో మాట్లాడి ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. స్థానిక జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో మాట్లాడి అన్నదానం కోసం కావాల్సిన సిబ్బందికి కావాల్సిన పాసులను ఏర్పాటు చేయించారు. దీంతో అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది.

తాజాగా, కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ లోని పేషెంట్ లు, వారి సంబంధికులు భోజనం దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలంగాణ జాగృతి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెర్లపల్లి అమర్ దీప్ గౌడ్ కల్వకుంట్ల కవిత దృష్టి కి తీసుకు వెళ్లడంతో, వెంటనే స్పందించిన కల్వకుంట్ల కవిత తన సొంత ఖర్చులతో మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో భోజన సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. దీంతో ఈరోజు నుండి ప్రభుత్వ హాస్పిటల్ లోని పేషెంట్ లు, వారి సంబంధికులు మరియు వైద్య సిబ్బంది భోజన సౌకర్యం కల్పించేలా అన్నదాన‌ కేంద్రాన్ని‌ ప్రారంభించారు.

ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న అనేక మంది రోగుల సహాయకులకు మాత్రమే కాకుండా వందలాది మంది పేద ప్రజలకు ఇప్పుడు ప్రతి రోజు మధ్యాహ్నం ఉచితంగా భోజనం అందుతుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిజామాబాద్ కు అత్యవసర పనులపైన వచ్చే వారికి ఇప్పుడు కడుపు నిండుతున్నది. ప్రస్తుతం ఎక్కడా ఆహారం దొరకని నేపథ్యంలో ఇక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కరు కల్వకుంట్ల కవితను ఆశీర్వదించి వెళ్తున్న పరిస్థితి అన్నదాన కౌంటర్ల వద్ద నెలకొని ఉంది.

- Advertisement -