ఆర్కే ఉన్నాడా..?లేడా..?:కోర్టు ప్రశ్న

217
- Advertisement -

మావోయిస్టు నేత ఆర్కే ఎక్కడున్నాడో వెంటనే స్పష్టం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్కే ఆచూకీ తెలపాలని ఆయన సతీమణి శిరీష దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ కోర్టులో విచారణ కొనసాగింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, సాధారణ పౌరుడైనా, మావోయిస్టు అయినా మనిషే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్ కౌంటర్ పేరుతో మనుషులను చంపటం సరికాదని అభిప్రాయపడింది.

ఆర్కే చనిపోయారా?…లేక పోలీసుల కస్టడీలో ఉన్నారో తెలపాలని హైకోర్టు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఒకవేళ పోలీసుల కస్టడీలో ఉంటే ఆర్కేకు ఎలాంటి ప్రాణహానీ తలపెట్టవద్దని ఆదేశించింది. ఎన్ కౌంటర్ జరిగి ఇన్నిరోజులు అయినా వివరాలు తెలిపేందుకు ఇంత సమయం ఎందుకు పడుతుందని న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. మావోయిస్టులైనా, సామాన్యులైనా ర‌క్షించాల్సింది ప్ర‌భుత్వ‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను గురువారానికి వాయిదా వేసింది.

online news portal

ఈ సందర్భంగా ఆర్కే భార్య శిరీష మాట్లాడుతూ తన భర్త పోలీస్ కస్టడీలోనే ఉన్నారని, ఆర్కేను వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్పై చాలా అనుమానాలు ఉన్నాయని, ఎన్ కౌంటర్ తర్వాత మరుసటి రోజుకు మృతుల సంఖ్య పెరగడం, కొన్ని మృతదేహాలను గుర్తించకుండా ఖననం చేయడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని శిరీష తరఫు న్యాయవాది అన్నారు. ఈ నెల 24 ఏవోబీ ఎన్ కౌంటర్ అనంతరం ఆర్కే ఆచూకీ లేదు.

- Advertisement -