బాహుబలి 1 మూవీలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని అప్పట్లో ఆ సినిమాను చూసిన ప్రేక్షకుల మదిలో గింగిరాలు తిరిగిన ప్రశ్న. ఇప్పుడు ఇంగ్లండ్తో జరిగిన మూడవ వన్డే తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంపైర్ల నుంచి బంతిని ఎందుకు తీసుకున్నాడు అనేది ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనిని చూసిన అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ మ్యాచ్లో ధోని ఇంగ్లాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయి సిరీస్ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ ముగియగానే క్రీడాకారులందరూ మైదానాన్ని వీడుతున్న సందర్భంలో ధోని మాత్రం నేరుగా ఎంపైర్ల దగ్గరికి వెళ్లి వారిచేతిలోని బంతిని అడిగి మరీ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సన్నివేశం క్రీడాభిమానుల్లో మరింత ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.
ఈ సీన్ ను చూసిన ధోని అభిమానులు ఆయన త్వరలోనే క్రికెట్కు గుడ్బై చెప్పబోతున్నాడని చర్చించుకుంటున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో ధోని తన మార్క్ను చూపించలేకపోయాడు. టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్గా, వికెట్ కీపర్గా తన అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని ఆటను ఇక తాము చూడలేమా అంటూ క్రీడాభిమానులు ఒకింత నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ పై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ధోని మరికొంత కాలం పాటు జట్టులోనే ఉంటాడని, ఆయన ఇప్పట్లో క్రికెట్ కు గుడ్బై చెప్పే అవకాశం లేదని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.
ఇంగ్లాండ్తో మ్యాచ్ అనంతరం ధోని బంతిని తీసుకోవడంలో ఎలాంటి అనుమానాలు లేవని, ఆయన కేవలం బంతి ఎంతలా దెబ్బతిందన్న విషయాన్ని తెలపడానికి ధోని బంతిని తీసుకున్నాడని రవిశాస్త్రి చెప్పాడు. ధోనిలాంటి అనుభవజ్ఞుడి సేవలు టీమిండియాకు అవసరమని, ఆయన తన అనుభవాలను క్రీడాకారుడిగా మరిన్ని రోజులు అందిస్తాడని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ధోనిలో గతంలో ఉన్న పస తగ్గిందని, ఆయన ఆటతీరులో ఉరుకులు, ఉత్సుకత లేవని మాజీ క్రీడాకారులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రి ధోనికి బాసటగా నిలవడం విశేషం.