ఆసియా కప్‌లో భారత్‌దే పైచేయి..

207
India vs Pakistan
- Advertisement -

దాయాదుల పోరులో భారత్ మరోసారి పైచేయి సాధించింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో అన్నిరంగాల్లో పాక్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. పాక్ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది.

స్వల్ప లక్ష్యం కావడంతో భారత్‌ పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఆరంభంలో ప్రమాదకర ఆమిర్‌ను ఆచితూచి ఆడిన ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌.. తర్వాత చెలరేగారు. రోహిత్‌, ధావన్‌ పోటీ పడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 13 ఓవర్లకు 86/0తో భారత్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. రోహిత్‌ శర్మ (52; 39 బంతుల్లో 6×4, 3×6), శిఖర్‌ ధావన్‌ (46; 54 బంతుల్లో 6×4, 1×6) రాణించగా అంబటి రాయుడు (31 నాటౌట్‌; 46 బంతుల్లో 3×4), దినేశ్‌ కార్తీక్‌ (31 నాటౌట్‌; 37 బంతుల్లో 2×4, 1×6) మిగతా పని పూర్తి చేశారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ ఏ దశలోనూ భారత బౌలర్లను ఎదుర్కొలేకపోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ (3/15), కేదార్‌ జాదవ్‌ (3/23), జస్‌ప్రీత్‌ బుమ్రా (2/23)ల విజృంభణతో పాక్‌ 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. బాబర్‌ అజామ్‌ (47; 62 బంతుల్లో 6×4), షోయబ్‌ మాలిక్‌ (43; 67 బంతుల్లో 1×4, 1×6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. సూపర్‌-4 దశలో భారత్‌.. ఆదివారం పాక్‌తో మళ్లీ తలపడబోతుండటం విశేషం. భవనేశ్వర్‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

- Advertisement -