రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఏడు వికెట్లకు 260 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్ (72), టామ్ లాథమ్ (39) శుభరంభాన్నిచ్చారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (41), రాస్ టేలర్ (35) ఆకట్టుకున్నా భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. నీషమ్ (6), వాట్లింగ్ (13) దూకుడు పెంచే ప్రయత్నంలో పెవిలియన్ చేరారు. డివిసిచ్ 11, సాంట్నర్ 17(నాటౌట్) , సౌథీ 9(నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 2, ధావల్ కులకర్ణి, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, ఈ రోజు రాంచీలో న్యూజిలాండ్తో టీమిండియా నాలుగో వన్డే ఆడుతున్న సందర్భంగా ధోనీ చెప్పినట్లే చేశాడు. ఇటీవలే ధర్మశాలలో మీడియాతో మాట్లాడుతూ తాను విరాట్ కోహ్లీ నుంచి తాను సలహాలను స్వీకరిస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్నప్పుడు విరాట్తో అధికంగా మాట్లాడాడు. కోహ్లీ నుంచి సూచనలు తీసుకున్నాడు. వన్డేల్లో తొలి మ్యాచ్ నుంచే ఫీల్డింగ్, బౌలింగ్ మార్పుల విషయంలో ధోనీ సూచనలు తీసుకుంటున్నాడు. తరుచుగా ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్మెన్ మైదానంలో సీరియస్గా చర్చించుకుంటూ కనిపిస్తున్నారు. నాలుగో వన్డేలోనూ వీరిద్దరు సీరియస్గా పలు అంశాలపై మాట్లాడుకున్నారు.