బెగ్గింగ్ ర‌హిత సిటీగా హైదరాబాద్

384
Hyderabad
- Advertisement -

బెగ్గర్స్ కు పూర్తి స్థాయిలో పునరావాసం, ఆర్థిక స్వావలంబనకు మార్కెటింగ్ టై-అప్ తో అనువైన వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి, నగరాన్ని బెగ్గింగ్ రహితంగా చేసేందుకు పైలట్ ప్రాజెక్టు క్రింద జిహెచ్ఎంసి ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త‌ శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. దేశ‌వ్యాప్తంగా ప‌ది న‌గ‌రాల‌ను పైలెట్ ప్రాజెక్ట్ కింద చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. 2020 ఏప్రిల్ నుండి పైలెట్ ప్రాజెక్ట్‌ను అమ‌లు చేసేందుకు స‌మ‌గ్ర కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని సూచించారు. టూరిజం ప్లాజాలో శనివారం జిహెచ్ఎంసి, పోలీసు అధికారులు, ఎన్‌.జి.వోల‌తో నిర్వ‌హించిన స‌ద‌స్సులో బెగ్గింగ్ లో వున్న వ్యక్తులకు గౌరవ ప్రదమైన పునరావాసం క‌ల్పించే స‌మ‌గ్ర‌ కార్యాచరణ ప్రణాళిక గురించి చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా రెడ్డి సుబ్ర‌హ్మ‌ణ్యం మాట్లాడుతూ.. బెగ్గ‌ర్స్ పున‌రావాసానికి రూ. 10కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 25 సంవ‌త్స‌రాల క్రితం హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ గా ప‌నిచేసిన‌ప్పుడు మౌలిక వ‌స‌తుల కొర‌త తీవ్రంగా ఉండేద‌ని, నేడు దేశవ్యాప్తంగా ఉన్న న‌గ‌రాల్లో ఉత్త‌మ సిటీగా హైద‌రాబాద్ గుర్తింపు పొందింద‌ని పేర్కొన్నారు.   పేద‌ల సంక్షేమానికి తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ద‌ని తెలిపారు. గౌర‌వంగా ఉండేందుకు డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్న‌ద‌ని, పేద‌ల‌కు అన్న‌పూర్ణ భోజ‌న ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న‌ద‌ని అభినందించారు. ప్ర‌తి వ్య‌క్తి గౌర‌వంగా బ్ర‌తికేందుకు అవ‌కాశం క‌ల్పించుట‌లో భాగంగా బెగ్గ‌ర్స్ సామాజిక, ఆర్థిక, కుటుంబ‌ ప‌రిస్థితుల‌ను గుర్తించాల‌ని తెలిపారు.

జిహెచ్ఎంసి డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్ మాట్లాడుతూ.. న‌గ‌రంలోని పేద‌లు, బెగ్గ‌ర్స్ సంక్షేమానికి స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారంతో కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు. 150 వార్డుల‌లో అన్న‌పూర్ణ ప‌థ‌కం కింద రూ.5/- కే భోజ‌నాన్ని అందిస్తున్న‌ట్లు తెలిపారు. బెగ్గ‌ర్స్‌కు ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, వృత్తి నైపుణ్య శిక్ష‌ణ ఇచ్చుట‌లో స‌హ‌క‌రించాల‌ని ఎన్‌.జి.వోల‌కు విజ్ఞ‌ఫ్తి చేశారు. విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్ పోటీ ప‌డుతున్న‌ద‌ని, పుర‌పాల‌క శాఖ మంత్రి కె.టి.ఆర్ ఆశ‌యాల మేర‌కు స‌మ‌న్వ‌యంతో పైలెట్ ప్రాజెక్ట్‌ను విజ‌య‌వంతం చేద్దామ‌ని పిలుపునిచ్చారు.

కేంద్ర సామాజిక న్యాయ‌, సాధికార‌త శాఖ‌ సంయుక్త కార్య‌ద‌ర్శి రాధిక‌చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ.. బెగ్గ‌ర్స్ స‌మ‌గ్ర పున‌రావాస కార్య‌క్ర‌మం పై విధివిధానాల‌ను రూపొందించుట‌కు దేశ వ్యాప్తంగా సామాజిక వేత్త‌లు, విద్యావేత్త‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, ప్ర‌భుత్వ అధికారుల‌తో చ‌ర్చిస్తున్న‌ట్లు తెలిపారు. బెగ్గింగ్‌లో ఉన్న దివ్యాంగులు, సీనియ‌ర్ సిటీజ‌న్లు, మ‌హిళ‌లు, పిల్ల‌ల సంక్షేమంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించ‌నున్న‌ట్లు తెలిపారు.

రాష్ట్ర పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ ..బెగ్గ‌ర్స్ పున‌రావాస కార్య‌క్ర‌మం అమ‌లులో కేంద్ర ప్ర‌భుత్వానికి జిహెచ్ఎంసి పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌ని తెలిపారు. బెగ్గింగ్ చాలా తీవ్ర‌మైన స‌మ‌స్యగా ఉన్న‌ప్ప‌టికీ స‌హ‌జంగా ప‌ట్టించుకోమ‌ని తెలిపారు. పూర్తిస్థాయిలో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు సామాజిక, ఆర్థిక దృక్కోణంలో చూడాల‌ని తెలిపారు. 2005-06లో హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన కాలంలో బెగ్గ‌ర్స్ ప‌రిస్థితి పై నిర్వ‌హించిన సామాజిక‌, ఆర్థిక స‌ర్వే గురించి వివ‌రించారు.

ఈ స‌ద‌స్సులో రంగారెడ్డి జిల్లా సంయుక్త క‌లెక్ట‌ర్ హ‌రీష్, జిహెచ్ఎంసి అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు వి.సంతోష్‌, రాహుల్ రాజ్‌, జె.శంక‌ర‌య్య‌, యు.సి.డి ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ డి.సౌజ‌న్య‌, ట్రాఫిక్ డిసిపి చౌహాన్‌, పోలీసు అధికారులు, ఎన్‌.జి.వోలు, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -