డ్రగ్స్ కేసు : సిట్ ముందుకు తనీష్‌..

229
Hero Tanish to Attend SIT Interrogation
- Advertisement -

డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించిన పలు షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ నోటి నుంచి వచ్చిన నిజాలతో టాలీవుడ్‌లో ప్రమఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా.. డ్రగ్స్ కేసులో విచారణకు యువ హీరో తనీష్ అల్లాడి సోమవారం ఉదయం సిట్ ముందు హాజరయ్యారు. ఉదయం 10.15 నిమిషాలకు ఆయన నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు.

Hero Tanish to Attend SIT Interrogation

ఈ భవనం ఐదో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలో 10.30 గంటల నుంచి తనీష్ విచారణ ప్రారంభమవుతుంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన కెల్విన్‌తో సంబంధాలున్నట్టు తేలిన సినీ ప్రముఖుల్లో తనీష్ ఒకరు. ఈ కేసులో టాలీవుడ్‌కి సంబంధించిన మొత్తం 12 మందికి సిట్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 10 మందిని సిట్ అధికారులు విచారించగా వారిలో 9 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు. ఇప్పుడు 11వ వ్యక్తిగా తనీష్‌ను ఈరోజు ప్రశ్నించనున్నారు.

కెల్విన్‌తో ఎలాంటి సంబంధాలున్నాయి?.. డ్రగ్స్ వాడతారా?.. గోవా, బ్యాంకాక్ ఎప్పుడైనా వెళ్లారా? వంటి ప్రశ్నలను తనీష్‌ను పోలీసులు అడగనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పూరీ జగన్నాథ్‌, శ్యామ్‌.కె.నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌, నవదీప్‌, చిన్నా, చార్మి, ముమైత్‌ఖాన్‌, రవితేజ, రవితేజ డ్రైవర్‌ను విచారించిన సంగతి తెలిసిందే. వారిని కూడా ఇలాంటి ప్రశ్నలతో సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. కాగా, తనీష్ బాలనటుడిగా తెలుగు ప్రజలకు సుపరిచితం. ‘నచ్చావులే’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇప్పటి వరకు సుమారు 20 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తు్న్నాడు. ఇంకా కెరీర్‌లో సరిగా నిలదొక్కుకోకుండానే ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు.

- Advertisement -