అటవీ భూముల ర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు:ఇంద్రకరణ్

498
ik reddy
- Advertisement -

అటవీ భూములు, వన్య ప్రాణుల ర‌క్ష‌ణ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప‌ని చేస్తుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో రాష్ట్ర‌స్థాయి అటవీ అధికారుల అర్థ సంవత్సరం సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. రెండు రోజుల పాటు జ‌రిగే ఈ వ‌ర్క్ షాపుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు అడ‌వుల ప‌రిర‌క్ష‌ణ‌, అడ‌వుల పున‌రుజ్జీవ‌నానికి అధిక ప్రాధ‌న్య‌త‌నిస్తున్నార‌న్నారు. జంగల్ బచావో, జంగల్ బడావో అనే నినాదాన్ని ఉద్య‌మ స్పూర్తిగా తీసుకుని పచ్చదనం పెంచుకోవటం, ఉన్నఅడవిని కాపాడుకోవటం కోసం అట‌వీ అధికారులు, సిబ్బంది నిరంత‌రం క‌ష్ట‌ప‌డాల‌ని సూచించారు. అట‌వీ, స‌హాజ వ‌న‌రుల సంరక్ష‌ణ‌లోభాగంగానే సీయం కేసీఆర్ ఐదుగురు మంత్రులతో కూడిన ప‌చ్చ‌ద‌నం క‌మిటీని ఏర్పాటు చేశార‌ని తెలిపారు. త్వరలోనే దీనిపై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం భేటీ కానుంద‌ని, తెలంగాణలో పచ్చదనం పెంచడం, అడవులు కాపాడడం, కలప స్మగ్లింగును అరికట్టడం తదితర అంశాల‌పై క్యాబినెట్ స‌బ్ క‌మిటీ చ‌ర్చించ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. పోడు సమస్యతో పాటు, వివాదాలున్న అటవీ భూముల సమస్యను కూడా పరిష్కరించాలనే చిత్త శుద్దితో ప్రభుత్వం ఉందని, సీ.ఎం కేసీఆర్ దీనిపై ప్ర‌త్యేక‌ దృష్టి పెట్టారని వెల్లడించారు.

అటవీ భూమిని, రెవెన్యూ రికార్డులతో సరిచూసుకుని ఇకపై పక్కాగా స్థీరీకరించుకోవాలనే, భ‌విష్య‌త్తులో ఎలాంటి ఆక్రమణలకు తావు ఇవ్వకూడదు అనే దృడ నిశ్చ‌యంతో ప్రభుత్వం ఉందన్నారు. దానికి త‌గ్గ‌ట్లుగానే అట‌వీ అధికారులు పోలీస్, రెవెన్యూ శాఖ‌ల‌ స‌మ‌న్వ‌యం చేసుకోని ప‌ని చేయాలని చెప్పారు. చెట్ల నరికివేత‌, క‌ల‌ప అక్ర‌మ ర‌వాణాను అరికట్టేందుకు, వ‌న్య‌ప్రాణుల ర‌క్ష‌ణ‌కు అట‌వీ మార్గాల్లో సీసీ కెమ‌రాల‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు.

ప్రతి 6 నెలలకు ఒకసారి అటవీ శాఖ పై సమీక్ష నిర్వహించడం అభినందనీయమ‌ని, ప్ర‌ణాళిక ప్ర‌కారం ప‌ని చేస్తే అనుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌చ్చ‌న్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అట‌వీ శాఖ‌ అధికారులు, సిబ్బందికి సర్వీస్ మెడల్స్ ను పునరుద్ధరిస్తామ‌ని, వచ్చే జనవరి 26 నుంచి సేవ ప‌త‌కాలు ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి హామినిచ్చారు. పచ్చదనం పెంపుకు, పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలనిఈ సంద‌ర్బంగా మంత్రి పిలుపునిచ్చారు.

ప‌చ్చ‌ద‌నం – ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ జ‌రుగుతుందని అయితే సీయం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో దీన్ని ముందే గుర్తించి తెలంగాణ‌కు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టార‌ని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వ‌ర్ తివారి అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం అట‌వీ సంర‌క్ష‌ణకు ఇస్తున్న ప్రాధ‌న్య‌త‌ను గుర్తించి అధికారులు, సిబ్బంది చిత్తశుద్దితో ప‌ని చేయాల‌ని పీసీసీఎఫ్ ఆర్.శోభ అన్నారు. అట‌వీ శాఖ‌లొ కొత్త గా నియామ‌క‌మైన ఉద్యోగుల‌కు సీనియ‌ర్ అధికారులు చేదోడు వాదోడుగా నిలువాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో కంపా నిధుల‌పై వార్షిక ప్ర‌ణాళిక (2019-20 ) నివేదిక‌ను అధికారుల‌తో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి విడుద‌ల చేశారు. వ‌ర్క్ షాపులో రాష్ట్ర అట‌వీ అభివృద్ది కార్పోరేష‌న్ విసీ అండ్ యండీ ర‌ఘువీర్, ఫారెస్ట్ అకాడ‌మీ డైరెక్ట‌ర్ పృథ్వీరాజ్, పీసీసీఎఫ్ (అడ్మిన్) మునీంద్ర‌, అద‌న‌పు పీసీసీఎఫ్ లు స్వ‌ర్గం శ్రీనివాస్, ఆర్.యం.డొబ్రియ‌ల్, ప‌ర్గెయిన్, సీఎఫ్ లు, అన్ని జిల్లాలకు చెందిన DFO, FDOలు,రిటైర్డ్ అడిష‌న‌ల్ పీసీసీఎఫ్ కోట తిరుప‌త‌య్య, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -