పెన్ పహాడ్‌కు చేరుకున్న గోదావరి జలాలు..

475
penpahad villages
- Advertisement -

గోదావరి జలాలు సూర్యపేట జిల్లా పెన్‌ పహాడ్‌కు చేరుకున్నాయి. పెన్ పహాడ్ మండలం మెఘ్యతండా గేల్ పైప్ లైన్ వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చి స్వాగతం పలికారు మంత్రి జగదీష్ రెడ్డి . మొట్టమొదటి సారిగా తమవద్దకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు చేరుకోవడంతో మండల ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్‌ పహాడ్ మండలానికి గోదావరి నీళ్లు దీపావళి నాటికి అందిస్తామన్న మాటను నిలబెట్టుకున్నాం అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పడు…. మడమ తిప్పడు అన్నది మరోమారు రుజువైందన్నారు. ఈ దీపావళి సంబురాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనమందించే కానుక అన్నారు.

ఇచ్చిన మాట మీద నిలబడే ప్రభుత్వం ఇది..గేల్ పైప్ లైన్ కింది నుండి తవ్వాల్సిన కాలువలను తవ్వకుండా వదిలేశారని చెప్పారు. పది సంవత్సరాలు పూర్తి అయినా కాలువ అటువైపు ఇటువైపు తవ్వి నిర్లక్ష్యం చేసి వదిలేశారని చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా..వెంటనే నిధులు మంజూరు చేసి గేల్ అనుమతితో కాలువను పూర్తి చేశాం అన్నారు. ఇవాళ రావిచెరువు,మొల్కాపురంతో పాటు చిదేళ్ల చెరువు, అన్ని తండాలకు గోదావరి జలాలు అందిస్తున్నాం అన్నారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఎఆర్‌ఎస్పీ ద్వారా నీళ్లు అందిస్తామని గత పాలకులు చెప్పినా అది బూటకం అని తేలిపోయిందన్నారు. ప్రజలను మోసం చేయడానికే ఆ రోజు మాయమాటలు చెప్పారు … ప్రజలు, రైతులు ఎదురు చూస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని చెప్పారు. రైతాంగానికి నీళ్లు అందించాలి సూర్యపేట జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పం ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అన్నారు.

కాళేశ్వరం ద్వారా ఇక్కడి రైతాంగం కలలు నెరవేర్చాలన్న లక్ష్యం ఈరోజుకు పూర్తి అయిందన్నారు. గోదావరి జలాలతో రావి చెరువు నింపాలన్న డిమాండ్ ఇక్కడి ప్రజలది …రావిచెరువుతో పాటు మండలంలోని అన్ని చెరువులకు గోదావరి నీళ్లు అందిస్తామన్నారు.

- Advertisement -