నగరంలో ఏవిధమైన విపత్తులు సంభవించినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం ద్వారా నగరవాసుల భద్రతకు భరోసా కల్పించేలా పాలనా యంత్రాంగాన్ని సిద్దం చేశామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రస్తుత వర్షకాలంలో సంభవించే విపత్తులను ఎదుర్కోవడానికి వివిధ శాఖలకు చెందిన మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో నేడు ఉదయం మేయర్ రామ్మోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరైయ్యారు.
మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వివిధ శాఖలకు చెందిన మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలన్నింటిని ఒకేతాటివైపుకి తేవడం జరిగిందని, తద్వారా ప్రస్తుత వర్షకాలంలో సంభవించే ఆకస్మిక ప్రమాదాలను ఎదుర్కోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో గంటకు 70 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు సంభవిస్తున్నాయని, వీటి వల్ల హోర్డింగ్లు కూలి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు నగరంలో జూన్ 15 నుండి ఆగష్టు 15వ తేదీ వరకు హోర్డింగ్స్, యూనిఫోల్స్ పై నిషేదం విధించినట్టు గుర్తుచేశారు.
నగరంలోని వివిధ శాఖలకు చెందిన వర్షకాల విపత్తుల బృందాలన్నింటికి ప్రత్యేక డ్రెస్ కోడ్ కలిగి ఉండడంతో పాటు ఆయా బృందాల వాహనాలకు జి.పి.ఎస్ తో అనుసంధానం చేయాలని తద్వారా అతితక్కువ సమయంలో విపత్తులను ఎదుర్కునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మొత్తం దేశంలోని విపత్తుల నివారణకు పూర్తిస్థాయిలో ప్రత్యేక విభాగం కలిగిన నగరంగా హైదరాబాద్ నగరం ఉందని అన్నారు. డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. విపత్తులను ఎదుర్కోవడానికి వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నందున ప్రతి ఏడాది వర్షకాల సంబంధిత సమస్యలు తగ్గుతున్నాయని అన్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ శాఖలకు చెందిన మొత్తం 493 డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్లు ఉన్నాయని పేర్కొన్నారు. నగరంలో ఎక్కడ ఎంత వర్షం పడితే ముంపుకు గురి అవుతాయనే వివరాలను నాసా, తెలంగాణ విపత్తుల నివారణ సంస్థల సహకారంతో రూపొందించామని తెలిపారు. నగరంలో 195 నీటి ముంపుకు గురయ్యే ప్రాంతాలుగా గుర్తించామని, 600 శిథిల, పురాతన భవనాలను కూడా కూల్చివేశామని పేర్కొన్నారు. గ్రేటర్లోని 150 వార్డులలో అత్యవసర పరిస్థితులు ఎదురయితే తగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి స్థానిక కమ్యునిటీహాళ్లు, పాఠశాలలను గుర్తించామని తెలిపారు. విపత్తుల నివారణ, సంబంధిత అంశాలపై నగరంలోని కార్పొరేటర్లందరికీ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు దానకిషోర్ పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి మాట్లాడుతూ.. విపత్తుల కార్యాచరణ ప్రణాళికపై వివిధ శాఖలకు చెందిన విధులు, బాధ్యతలతో కూడిన సవివర నివేదికను రూపొందిస్తున్నామని తెలిపారు. రానున్న మూడు మాసాలు అత్యంత కీలకమని ఈ సమయాల్లో ఏ విధమైన విపత్తలు వచ్చినా ఎదుర్కోవడానికి తమ బృందాలు సిద్దంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, జలమండలి, ఫైర్ సర్వీసులు, పోలీసు, ట్రాఫిక్ విభాగం, హైదరాబాద్ మెట్రో రైలు, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, విద్యుత్ తదితర విభాగాల ఉన్నతాధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు పాల్గొన్నాయి.