సీఎం స‌హాయ‌నిధికి భారీగా విరాళాలు

295
cm kcr
- Advertisement -

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు. ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ రూ.50 లక్షల విరాళం అందించారు. ఎఐజి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ డివిఎస్ రాజు దీనికి సంబంధించిన చెక్కును ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. అరబిందో ఫార్మా మొత్తం 11 కోట్ల విలువైన నగదు, శానిటైజర్లు, మందులు విరాళంగా అందించారు. రూ.7.5 కోట్ల నగదుకు సంబంధించిన చెక్కును అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి, డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సిఎంకు అందించారు. రూ.2.5 కోట్ల విలువైన శానిటైజర్లను, రూ.ఒక కోటి విలువైన మందులను రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వనున్నట్లు ప్రకటించారు.

గ్లాండ్ ఫార్మా ఒక కోటి రూపాయలను విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును గ్లాండ్ ఫార్మా ఎండి శ్రీనివాస్ సాదు సిఎంకు అందించారు. నవభారత్ వెంచర్స్ రూ.2.5 కోట్ల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ చైర్మన్ డి.అశోక్, సిఇవో వి.విక్రం ప్రసాద్, ఇ.డి. నిఖిల్ సిఎంకు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యాహ్న భోజనం వండే కార్మికులు మొత్తం రూ.2.65 కోట్ల విరాళం అందించనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను మద్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమాండ్లు సిఎంకు అందించారు. ఈసంద‌ర్భగా విరాళాలు అందించిన ఆ దాతలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -