కొత్త వ్యవసాయ విధాన రూపకల్పనపై సీఎం సమీక్ష..

360
kcr cm
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలకు తగినట్లు, మార్కెట్ లో డిమాండు కలిగిన పంటలను సాగు చేసేటట్టు రైతులకు మార్గదర్శకం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వరి మాత్రమే కాకుండా ఇంకా ఏ పంటలు సాగు చేయడం వల్ల రైతులకు మేలు కలుగుతుందో అధ్యయనం చేసి మే 5లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను సిఎం ఆదేశించారు. వరిలో సన్న రకాలను ఎక్కువగా సాగు చేసే విధంగా రైతులను చైతన్య పరచాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించే గోదాముల్లో తప్పకుండా కోల్డ్ స్టోరేజిని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో నూతన వ్యవసాయ విధానం రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండో రోజైన బుధవారం కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, జనార్థన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ విశ్వ విద్యాలయం విసి ప్రవీణ్ రావు, సీడ్ కార్పొరేషన్ ఎండి కేశవులు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిభాయి, హర్టికల్చర్ ఎండి వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘‘తెలంగాణలో గతంలో ప్రాజెక్టులు, కరెంటు సరిగా లేకపోవడం వల్ల సాగునీటి లభ్యత అంతగా లేదు. ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో రైతులు ఎవరికి తోచినట్లు వారు వారి వనరులకు అనుగుణంగా పంటసాగు చేశారు. అందరూ ఒకే పంట వేయడం వల్ల ధరలు కూడా రాలేదు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మారుతున్నది. ప్రతీ మూలకూ సాగునీరు అందుతున్నది. 24 గంటల కరెంటు వల్ల బోర్ల ద్వారా కూడా జోరుగా వ్యవసాయం సాగుతున్నది. కాబట్టి రైతులను సరిగ్గా నిర్ధేశించగలిగితే లాభదాయక వ్యవసాయం చేస్తారు. పంటల ఎంపికలో, సాగు పద్ధతుల్లో, ఎరువుల వాడకంలో, మార్కెటింగులో మార్పులు వస్తాయి. ఈ దిశగా రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలషించారు.

kcr review

‘‘రాష్ట్రంలో ఎక్కువగా వరి పండిస్తున్నారు. పంటకాలం తక్కువనే కారణంతో దొడ్డు రకాలు పండిస్తున్నారు. కానీ ఎక్కువ మంది జనం సన్నరకాలు తింటున్నారు. సన్నరకాలకు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు సాగునీటి వసతి కూడా ఉంది కాబట్టి రైతులు ఎక్కువగా సన్నరకాలు పండించే విధంగా చైతన్య పరచాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు సాగు చేయాలి. అలా అయితేనే అన్ని పంటలకు డిమాండ్ వస్తుంది. రైతులు తక్కువ శ్రమ, ఎక్కువ దిగుబడి, మార్కెట్ అవకాశాలు, మంచి ఆదాయం పొందగలిగిన పంటలను గుర్తించాలి. వాటిని రైతులకు సూచించాలి. ఏ రైతు ఏ పంట వేయాలో నిర్ణయించి, సాగు చేయించాలి. వేరుశనగ, కందులు, పామాయిల్ లాంటి వాటికి మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇంకా ఇలాంటి డిమాండ్ కలిగిన పంటలను గుర్తించాలి. వాటిని ఎన్ని ఎకరాల్లో పండించాలి? అనే విషయం తేల్చాలి. తెలంగాణ రాష్ట్రంలో కూరగాయలు, పండ్లకు కూడా కొరత ఉంది. అవి ఏ మోతాదులో పండించాలి అనే విషయంపై కూడా అధ్యయనం జరగాలి.

నీటి వసతి పెరిగినందున ఫిష్ కల్చర్ ను కూడా తెలంగాణలో విస్తరించవచ్చా? అనే విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎరువుల వాడకం ఇప్పటిలాగానే ఉండాలా? ఏమైనా మార్పులు అవసరమా? అనే విషయాలను కూడా పరిశీలించాలి. పూర్తి స్థాయి అధ్యయనం చేసి మే 5లోగా నివేదిక ఇవ్వాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించాలని నిర్ణయించినందున వెంటనే స్థలాలను గుర్తించాలని అధికారులను సిఎం కోరారు. కొత్తగా నిర్మించే గోదాముల్లో కోల్డ్ స్టోరేజ్ సదుపాయం కల్పించాలని చెప్పారు.

- Advertisement -