వెంటనే మంచినీటి రిజర్వాయర్ నిర్మించాలి-సీఎం కేసీఆర్‌

236
- Advertisement -

హైదరాబాద్ నగరానికి మంచినీటి రిజర్వాయర్ నిర్మించే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమీషనర్ దానకిశోర్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

హైదరాబాద్ నగరానికి ఎప్పటికీ త్రాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు వెంటనే డెడికేటెడ్ మంచినీటి రిజర్వాయర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి గోదావరి నీటిని తరలించి, ప్రతిపాదిత మంచినీటి రిజర్వాయర్‌ను ఎప్పటికప్పుడు నింపుతూ పోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి పారుదల శాఖ అధికారులు, ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు సంయుక్తంగా సమావేశమై మంచినీటి రిజర్వాయర్, పైపులైన్లకు సంబంధించి అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతీ ఇంటికీ మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని చెప్పారు.

kcr

‘‘ప్రస్తుతం గోదావరి, కృష్ణా నీళ్ళను చాలా దూరం నుంచి హైదరాబాద్ తరలిస్తున్నాము. అయినా అవి సంవత్సరం పొడవునా నగర ప్రజల మంచినీటి అవసరాలు తీర్చలేకపోతున్నాయి. భవిష్యత్తులో ఇలా జరగడానికి వీల్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటి సరఫరా జరుగుతుంది. ప్రాజెక్టుల నీటిలో పది శాతం మంచినీళ్లకు వాడుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కాబట్టి ఈ రెండు రిజర్వాయర్ల నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లు అందించాలి. దీనికోసం కేశవరం దగ్గర రిజర్వాయర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మించాలి. అక్కడి నుంచి నగరానికి మంచినీటి సరఫరా జరగాలి. దీనికోసం వెంటనే అంచనాలు రూపొందించాలి. గోదావరి, కృష్ణా నీటిని ప్రస్తుత పద్ధతిలో తరలిస్తూనే ప్రత్యామ్నాయంగా రిజర్వాయర్ కూడా నిర్మించాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -