నేడు ఐపీఎల్-11 ఫైనల్ పోరు..

289
CSK and SRH
- Advertisement -

రెండూ రెండే. రెండూ బలమైనవే. ‘పులి, పులి పోట్లాడితే పులే గెలుస్తుంది’ ఇది ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీలకు ముందు టీవీ చానళ్లలో వచ్చిన ప్రోమోలోని ఓ వ్యాఖ్య. నిజమే… ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీల్లో రెండు పులులే పోట్లాడుతున్నాయి. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ చెన్నై సొంతమైతే.. అత్యంత పదునైన బౌలింగ్‌ హైదరాబాద్‌ సొంతం. ముదుర్ల జట్టంటూ జోకులు పేలినా, అనుభవాన్నే ఆయుధంగా మలుచుకున్న జట్టు చెన్నె. అయితే.. టోర్నీ ఆరంభంలోనే వార్నర్‌ను కోల్పోయినా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన జట్టు హైదరాబాద్‌.

ధోనీసేననే కాస్త ఎక్కువ సమతూకంగా కనిపిస్తున్నా.. అత్యంత స్వల్ప లక్ష్యాలను సైతం కాపాడుకున్న విలియమ్సన్‌ బృందం టైటిల్‌ కోసం బలంగా పోటీలో నిలుస్తోంది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగే ఫైనల్లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు.. విలియమ్సన్‌ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. మొత్తంగా చెన్నైకిది ఏడో ఫైనల్‌కాగా.. సన్‌రైజర్స్‌ మూడేళ్లలో రెండో ఫైనల్‌ ఆడబోతోంది.

CSK and SRH

గత సంవత్సరం పోటీలను ఓమారు గుర్తు చేసుకోండి. మహేంద్ర సింగ్ ధోనీ, స్టీవ్ స్మిత్ తదితర ఆటగాళ్ల బలంతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు, లీగ్ దశలో రెండు మ్యాచ్ లతో పాటు, క్వాలిఫయర్-1 పోటీలోనూ ముంబై జట్టును ఓడించింది. ఆపై ముంబై జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్ విజేత కోల్ కతా నైట్ రైడర్స్ పై క్వాలిఫయర్-2 పోటీలో గెలిచి ఫైనల్స్ కు వచ్చింది. టైటిల్ ఎగరేసుకు పోయింది. ఈ విధంగా చూస్తే, ఈ సంవత్సరం చెన్నై చేతిలో తానాడిన మూడు మ్యాచ్ లనూ ఓడిపోయిన హైదరాబాద్ జట్టు, ఫైనల్స్ లో చెన్నైపై విజయం సాధించి పగ తీర్చుకుంటుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఇక రెండో లెక్క ఏంటంటే, ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఢిల్లీ జట్టు నిలిచినప్పుడెల్లా, రెండో స్థానంలో ఉన్న జట్టు కప్పును ఎగరేసుకుపోయింది. 2011లో చెన్నై, 2013లో ముంబై, 2014లో కోల్ కతా జట్లు టైటిల్ కొట్టగా, ఆ సంవత్సరాల్లో ఢిల్లీ చివరి స్థానంలో ఉంది. ఈ లెక్క ప్రకారం కప్పు ఈ సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ కు రావాలి. ఎవరి లెక్కలు వారివే అయినా, నేటి పోటీ రెండు పులుల మధ్య పోటీయేననడంలో సందేహం లేదు.

- Advertisement -