తెలంగాణకు రూ. 3110 కోట్లు మంజూరు

878
indrakaran reddy
- Advertisement -

కంపా నిధులు కింద రాష్ట్రానికి రూ. 3110 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర అటవీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ‌ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో గురువారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్ని రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఇంద్రకరణ్….కంపా (కాంపెన్సెటరీ ఎఫారెస్టెషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధుల కింద రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం భారీగా నిధులు మంజూరు చేసింద‌న్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పెద్దమొత్తంలో నిధులు విడుదల అయ్యాయని తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రత్యామ్నాయ అడవుల సృష్టికి సీయం కేసీఆర్ సార‌ధ్యంలోని త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని చెప్పారు.

ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి కంపా నిధులను సమర్థంగా ఉపయోగించడం వల్లే కేంద్రం నిధులు విడుద‌ల‌న చేసింద‌ని స్ప‌ష్టం చేశారు. వివిధ ప్రాజెక్టుల కింద తీసుకున్న అటవీభూమికి ప్రత్యామ్నాయంగా అడవుల పెంపకానికి సీయం కేసీఆర్ అధిక ప్రాధ‌న్యతనిస్తున్నార‌ని తెలిపారు. ఈ కంపా నిధుల‌తో మన రాష్ట్రంలో అడవుల పెంపకానికి ఉపయోగించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్ర‌భుత్వం హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా 230 కోట్ల మొక్క‌ల‌ను నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకోగా నాలుగు విడ‌త‌ల్లో 113.58 కోట్ల‌ మొక్క‌ల‌ను నాటామ‌ని వెల్ల‌డించారు.

ఐదో విడ‌త హ‌రిత‌హ‌రం కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ ఏడాది 83 కోట్ల మొక్క‌లు నాటాల‌ని ల‌క్ష్యం కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 30 కోట్ల మొక్క‌ల‌ను నాటామ‌న్నారు. సీయం కేసీఆర్ కొత్త‌గా పంచాయ‌తీ రాజ్, మున్సిప‌ల్ చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చార‌ని…. ఆ చ‌ట్టాల్లో కూడా మొక్క‌ల సంర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట వేశార‌న్నారు. నాటిన మొక్క‌ల్లో 85% మొక్క‌ల‌ను కాపాడాల‌ని..లేదంటే స్థానిక ప్ర‌జాప్ర‌తినిదులు, సంబంధిత అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే విధంగా చ‌ట్టంలో పొందుప‌రిచార‌ని తెలిపారు.

ఇప్పుడు ఉన్న అడవులను రానున్న నాలుగేళ్లలో రెట్టింపు చేసే లక్ష్యంగా పథకాలు సాగాలని సమావేశంలో చర్చ జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం పథకాన్నికి నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. సీఎం ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేసి రానున్న రోజుల్లో ఆకుపచ్చ తెలంగాణ సాధిస్తామన్న విశ్వాసం వ్య‌క్తం చేశారు. అర్బన్‌పార్క్‌ల ఏర్పాటు, అడవుల పునర్జీవం వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధ‌న్య‌తనిస్తున్నామ‌న్నారు.

అడవుల పరిరక్షణ, ప్రత్యామ్నాయ భూముల్లో చెట్ల‌ పెంపకం, నది పరివాహక ప్రాంతాల్లో అడవుల రక్షణ, కంపా నిధుల వినియోగం, కేటాయింపులు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించిన‌ట్లు మంత్రి తెలిపారు. ఇంద్రకరణ్ రెడ్డితోపాటు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్. శోభ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -