కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు..

426
bjp win
- Advertisement -

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో కమలనాథులు విజయం సాధించింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. 15 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు.

ఈ ఉప ఎన్నికల ఫలితాలను కలుపుకుంటే శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం 117కు చేరింది. కాంగ్రెస్‌ 68, జేడీ(ఎస్‌) 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం 112.

ఇక యడియూరప్ప సర్కార్‌ను మరోసారి కూల్చాలని కలలుకన్న జేడీఎస్‌, కాంగ్రెస్‌లకు ఉప ఎన్నికల్లో చేదు పలితాలే ఎదురయ్యాయి. అన్ని స్థానాల్లో వేరువేరుగా పోటీకి దిగిన విపక్షాలు అధికార బీజేపీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఈ ఫలితాలతో బీజేపీకి 117 ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో సీఎం యెడియూరప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు.

yeddyurappa

యెల్లాపూర్, రనెబెన్నూర్, విజయనగర, మహాలక్ష్మి లేఅవుట్, చిక్కబల్లూపుర, కే ఆర్ పుర, కే ఆర్ పేటె, అథని, గోకక్, హిరేకెరూర్, యశ్వంత్ పుర, కగ్వాడ్ శాసన సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్‌కు శివాజీనగర, హున్సుర్ స్థానాలు లభించాయి. హోస్కోటే నుంచి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.

ఎన్నికల ఫలితాలపై యడియూరప్ప మాట్లాడుతూ తాను చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు చాలా మంచి తీర్పు ఇచ్చారని చెప్పారు. ప్రజలు సుస్థిర ప్రభుత్వం కోసం, తన పరిపాలన తీరును చూసి ఓట్లు వేశారన్నారు. తమ పార్టీ ప్రజాభిప్రాయాన్ని అంగీకరిస్తుందన్నారు. ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండా తాము ప్రజానుకూలంగా, సుస్థిర ప్రభుత్వాన్ని అందజేస్తామని చెప్పారు.

- Advertisement -