సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా శుభవార్తనందించింది. బ్యాంకుల్లో డబ్బుల కోసం గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా వారి ఇంటివద్దనే ప్రాథమిక సర్వీసులను అందజేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది.
నగదు స్వీకరించడం, డెలివరీ చేయడం, చెక్ బుక్స్, డిమాండ్ డ్రాఫ్ట్లు, కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించడం, లైఫ్ సర్టిఫికేట్లు అందించడం వంటి సర్వీసులను సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే అందించాలని తెలిపింది. 2017 డిసెంబర్ 31 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని ఆర్బీఐ సూచించింది.
దీనికోసం బ్యాంకులు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటుచేయాలని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొంది. ఇందుకోసం పెన్షనర్లు తమ ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్ను పెన్షన్ పేయింగ్ బ్యాంకు బ్రాంచుల వద్ద సమర్పించాల్సి ఉంది. పెన్షనర్లు సమర్పించిన ఈ సర్టిఫికేట్లను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో చెక్ బుక్లను అందుకోవడానికి కూడా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇక బ్యాంకులకు రావాల్సినవసరం లేదు. అయితే ఈ సేవలందించినందుకు గాను ఎంత మొత్తంలో ఛార్జీలు విధించనుందో మాత్రం ఆర్బీఐ ఇంకా స్పష్టంచేయలేదు.