కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఆదివారం జరగనున్న నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులకు ఉద్వాసన పలికారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత,కేంద్ర మంత్రి పదవికి దత్తాత్రేయ తన పదవికి రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని ఆయన అధిష్ఠానానికి వెల్లడించారు. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీ అవసరాల మేరకు పనిచేస్తానని ఆయన తెలిపారు.
ఈ విషయమై గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో సమావేశమై చర్చించినట్లు తెలిపారు. కేంద్రమంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనకు గవర్నర్ గిరి దక్కుతుందన్న ప్రచారం జోరందుకుంది. మొదటినుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి కావడంతో ఆయన సేవలను తప్పకుండా వినియోగించుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు.
దత్తాత్రేయతో పాటు కేంద్ర మంత్రులు రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఉమాభారతి, రాధా మోహన్ సింగ్, సంజీవ్ బలియాన్, గిరిరాజ్ సింగ్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.