దేశవ్యాప్తంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలోనూ అధిక సంఖ్యలో ఏటీఎంల దగ్గర నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఒకటి రెండు ఏటీఎంలలో నగదు ఉన్నా భారీగా క్యూలైన్లలలో నిలబడవలసిన పరిస్థితి ఏర్పిడింది. ఏటీఎంలలో రూ.2000 నోట్లు ఉండడంతో చిల్లర కష్టాలు మొదలయ్యాయి. బ్యాంకులకు వెళుతుంటే, అక్కడ సైతం అడిగినంత డబ్బు ఇవ్వకుండా కోత విధిస్తున్నారు. క్యాష్ కష్టాలపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా, ఇటీవలి కాలంలో వరుస సెలవులు రావడంతోనే ఈ ఇబ్బంది కలిగిందని బ్యాంకుల ఉన్నతాధికారులు చెబుతున్నారు.
దీనిపై తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దేశవ్యాప్తంగా ఉన్న కరెన్సీ పరిస్థితిపై ఆయన సమీక్ష నిర్వహించామన్నారు. ప్రస్తుతం అవసరానికి మించి నగదు చెలిమణీలో ఉందని, బ్యాంకులలో సరిపడేంత కరెన్సీ ఉందన్నారు. ఒకేసారి కరెన్సీ డిమాండ్ ఏర్పడడం వల్లే కొన్ని ప్రాంతాలలో పాక్షికంగా నగదు లోటు ఏర్పడిందని, కరెన్సీ కొరత ఏర్పడిన ప్రాంతాలలో సర్దుబాటు చర్యలు చేశామని ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. చత్తీస్ఘడ్లోనూ తీవ్ర నగదు కొరత ప్రభావం ఏర్పడిందని, త్వరలో పరిస్థితి చక్కబడుతుందని ఆ రాష్ట్ర సీఎం రమణ్ సింగ్ తెలిపారు.