పాత భవనాలను ఖాళీ చేయండి…

538
- Advertisement -

హైదరాబాద్ లో వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. వర్షం కారణంగా మృతిచెందడం దురదృష్టకరమన్నారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నగరంలో ఇవాళ కురిసిన వర్షం కారణంగా సంభవించిన ప్రమాదాలపై సమీక్ష నిర్వహించిన కేటీఆర్ శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చి వేసుకోవాలని నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు పునరుద్దరించుకోవాలి లేదా వాటిని కూల్చి వేయాలని విజ్ఞప్తి చేశారు. మిగతా భవనాల యజమానులు కూడా స్పందించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. మరి కొన్ని చోట్ల శిథిలావస్థలో ఉన్న భవనాల నుంచి ఖాళీ చేయాలని కూడా ఆదేశించామన్నారు.

ప్రజలకు సమస్యలేవైనా ఉంటే జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్ 040-21111111 కు డయల్ చేయాలని కోరారు. 100 నెంబరుకు కూడా ఫోన్ చేయొచ్చని వివరించారు. ఇప్పటివరకు 203 ఫిర్యాదులు తమకు ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వీటిలో 83 సమస్యలను పరిష్కరించామని…120 సమస్యలు పరిశీలనలో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ వర్షం, వాతావరణ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని వెల్లడించారు. ఆరు చోట్ల చెట్లు విరిగిపడ్డాయని…వాటిని తొలగిస్తున్నామని తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి నగరంలోని రోడ్లన్ని బాగుచేయాలనే తాపత్రయంతో పనిచేస్తున్నామని తెలిపారు. నగరంలో గంటకు 60 మీమీ వర్షం కురిసిందని వెల్లడించారు.

- Advertisement -