యాదాద్రిలో ఇకపై బెల్లం లడ్డూలు..

354
bellam laddu
- Advertisement -

తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం కృష్ణశిలలతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆలయ చారిత్రక, ధార్మిక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటేలా ,ఆధ్యాత్మిక ప్రపంచానికి కరదీపికగా నిలవనుంది నరసింహ స్వామి సన్నిధి. దాదాపు ఎనిమిది శతాబ్దాల తర్వాత ప్రాచీన శిల్పకళా రీతిలో భారీ రాతి నిర్మాణాలతో రూపుదిద్దుకుంటున్న ఆలయం ఇదే కావడం విశేషం.

భక్తులు అత్యంత పవిత్రంగా కొలిచే యాదాద్రి లడ్డూ ప్రసాద విషయంలో ప్రత్యేకత చాటుకునేందుకు సిద్ధమయింది. ఇప్పటి వరకు చక్కెర ఇతర మిశ్రమాలతో తయారు చేసిన లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండేది.. ఇక నుంచి చెక్కర లడ్డూతో పాటు బెల్లంతో తయారు చేసిన లడ్డూను భక్తులకు అందించేందుకు సిద్ధమయ్యింది.

భక్తుల ఆరోగ్య (షుగర్) పరిస్థితుల దృష్ట్యా చక్కరపాకంతో తయారు చేయుటవల్ల భక్తులు లడ్డూలు తినలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో బెల్లంతో తయారుచేయాలని దేవస్థానం అధికారులు యోచించారు. గత రెండు రోజులుగా ఈ బెల్లం లడ్డూను దేవస్థానం అధికారులు అందుబాటులోకి తెచ్చారు.

బెల్లం పాకంతో లడ్డూల తయారీ అంశాన్ని తెలియజేసేందుకు 11 మంది ఉద్యోగులతో ప్రత్యేక కమిటీని నియమించారు. ఇందులో ఐదుగురు ఏ ఈఓలు, ఇద్దరు ప్రధాన పూజారులు మరో ఇద్దరు వంట స్వాములు ఇద్దరు పర్యవేక్షకుల తో ఏర్పాటైన కమిటీ వాటి తయారీ చేపట్టింది.

బెల్లం లడ్డూ 80 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు బరువు ఉండనుంది. లడ్డూ ప్రసాద విషయంలో దేవస్థానం నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి ప్రసాదం మరింత రుచిగా ఉండనుందని చెబుతున్నారు. మొత్తంగా యాదాద్రి లక్ష్మీ నరసింహుడి భక్తులకు ఇకపై కొత్తరకం లడ్డూల రుచి చూసే భాగ్యం దక్కనుంది.

- Advertisement -