కేసీఆర్ చూపు కాంగ్రెస్ వైపు??

322
Kcr Congres
- Advertisement -

దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలో నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గత కొద్ది రోజులుగా చెబుతున్నారు. అందుకోసం కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, కర్ణాటక సీఎం కుమారస్వామి పలువురిని కలిసి మద్దతు కోరిన విషయం తెలిసిందే. మొత్తానికి దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీలతో కలిసి కింగ్ మేకర్ కావాలనే దిశగా ఆయన అడుగులేస్తున్నారు. అయితే ఈసారి కేంద్రంలో ఒక వేళ బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టకపోతే…కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉండాలి కాబట్టి రాష్ట్ర అభివృద్ది కోసం కేసీఆర్ యూపిఏ కూటమిలో చేరాలనకుంటున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానంతో కేసీఆర్ కు సంబంధాలు అంత పెద్దగా లేకపోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమార స్వామితో సీఎం కేసీఆర్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కర్ణాటక సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామితోనూ కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవలే ఆలమట్టి నుంచి నీటి విడుదల చేయాలని కేసీఆర్ ఫోన్ ద్వారా కోరగా.. అందుకు కుమారస్వామి అంగీకరించారు. కేసీఆర్ కాంగ్రెస్‌తో దోస్తీ దిశగా అడుగులేస్తున్నారని, దానికి కుమారస్వామి మధ్యవర్తిత్వం వ్యవహరించే అవకాశం ఉందని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.

కేసీఆర్ ను కాంగ్రెస్ కుమార స్వామి మధ్య వర్తిత్వం వహించడంతో ఆయనకు ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఇదే అదనుగా ఆయన పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక కేసీఆర్ ఎటు వెళ్తే అటు వైసీపీ అధినేత జగన్ కూడా రానున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ 16 స్ధానాల్లో విజయం సాధిస్తే..ఏపీలో జగన్ దాదాపు 20 సీట్లు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మే 23 తర్వాత కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లకు మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్.

- Advertisement -